ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రభాస్ భారీ విరాళం: రాజు.. రాజే
అమరావతి: బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వరుస అల్పపీడనాలు ఏపీని అతలాకుతలం చేశాయి. వరదతో ముంచెత్తాయి. అల్పపీడనం వల్ల కురిసిన భారీ వర్షాలు.. రాయలసీమను అతలాకుతలం చేశాయి. చిత్తూరు, కడప, అనంతపురంలతో పాటు దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లా నెల్లూరును ముంచెత్తాయి. రాయలసీమ జిల్లాలు నిండా మునిగాయి. ఈ ప్రాంతంలో ప్రవహించే పెన్నా, పాపాఘ్ని, కుందూ, చెయ్యేరు, చిత్రావతి.. ఇలా అన్ని నదులూ ఉప్పొంగాయి. ఇదివరకెప్పుడూ లేనంతగా ఉగ్రరూపాన్ని దాల్చాయి.
ఆయా నదుల తీర ప్రాంతాలన్నీ వరదముంపునకు గురయ్యాయి. భారీ వర్షాలకు 42 మందికి మంది మరణించినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ కట్ట తెగింది. మైలవరం రిజర్వాయర్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో లక్షలాది క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలి వేస్తోన్నారు జల వనరుల శాఖ అధికారులు. అతి భారీ వర్షాలకు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలగిరుల్లో ఉన్న నీటి ప్రాజెక్టులన్నీ వరదపోటుకు గురయ్యాయి.
కపిలతీర్థం, మాల్వాడిగుండం, పాపనాశనం.. ఇవన్నీ ఉప్పొంగాయి. వరద నీరంతా తిరుపతి నగర వీధుల్లోకి ప్రవహించింది. తిరుమల తిరుపతి జలమయం అయ్యాయి. పలు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. అలిపిరి నడకదారి మొత్తం ధ్వంసమైంది. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. తిరుపతిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. శ్రీకాళహస్తి, నెల్లూరుతో పాటు జిల్లాలోని నాయుడుపేట, సూళ్లూరుపేట, గూడూరు, విద్యానగర్ వంటి చోట్ల మళ్లీ వర్షం కురిసింది.
ఈ పరిణామాలతో ఏపీ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరికి గురైంది. వరద నష్టం అంచనా సుమారు 6,054 కోట్ల రూపాయలుగా అంచనా వేసింది. తక్షణ ఆర్థిక సహాయం కింద కనీసం 1,000 కోట్ల రూపాయలను విడుదల చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కేంద్ర బృందం సైతం వరద ముంపునకు గురైన జిల్లాల్లో పర్యటించింది. క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసింది. దీనిపై ఓ సమగ్ర నివేదికను రూపొందించింది. కేంద్రం నుంచి ఆర్థిక సహాయం ఇంకా అందాల్సి ఉంది.
చిత్తూరు, కడప, అనంతపురంలతో పాటు దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లా నెల్లూరు జిల్లా ప్రజలను కన్నీరు పెట్టించాయి ఈ వరదలు. దీనిపట్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమ స్పందించింది. తనవంతు విరాళాన్ని ప్రకటించింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. గీతా ఆర్ట్స్ తరఫున 10 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ 25 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తానని చెప్పారు.
తాజాగా ఇదే జాబితాలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ చేరారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏకంగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. టాలీవుడ్ ప్రముఖుల నుంచి ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం రూపంలో ఇప్పటిదాకా అందిన అతి పెద్ద మొత్తం ఇదే. ఇదివరకు కరోనా వైరస్ సహాయ కార్యక్రమాల కోసం ప్రభాస్.. రెండు తెలుగు రాష్ట్రాలకు 50 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు.
ఇక తాజాగా- వరద సహాయక పనుల కోసం కోటి రూపాయలను ప్రకటించారు. త్వరలో ఈ మొత్తంతో కూడిన చెక్ను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించనున్నారు. ప్రస్తుతం ప్రభాస్..నటించిన రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. పూజా హెగ్డె హీరోయిన్గా నటించిన రాధేశ్యామ్.. సంక్రాంతికి విడుదల కానుంది.