పవన్ వ్యాఖ్య: తానేనని చంద్రబాబు! టిడిపిలోకి నటి సన
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'సమర్థ' వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనకు అనువదించుకున్నారు! శుక్రవారం పలువురు నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.
సమర్థుడైన నేతకు ఓటు వేయాలని పవన్ కళ్యాణ్ నిన్నటి విశాఖ జనసేన సభలో చెప్పారని గుర్తు చేశారు. ఇది ప్రయోగాలకు సమయం కాదని తాను ముందే చెప్పానన్నారు. అయితే, కాంగ్రెసు వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు తమ పార్టీ పోటీ చేయడం లేదని పవన్ ప్రకటించారన్నారు. సమర్థ నేతకు ఓటేయాలని పవన్ చెప్పారన్నారు. జైల్లో ఉండే వారిని చూసి పెట్టుబడులు వస్తాయా అన్నారు. టిక్కెట్ల కోసం అడ్వాన్సులు, బుకింగులు ఎప్పుడైనా చూశామా అన్నారు.

రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నారు. సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేసే శక్తి తనకు ఉందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఖాళీ అయిందన్నారు. ఓట్లు చీల్చకూడదన్న పవన్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానని చెప్పారు. సీమాంధ్రకు న్యాయం చేస్తామని సోనియా ఇప్పటి వరకు చెప్పలేదన్నారు. సంఖ్యాబలం లేక పోవడం వల్లనే విభజన విషయంలో తమ పట్టు నెగ్గలేదన్నారు.
టిడిపిలోకి సన, జగన్ పార్టీ నేత
చంద్రబాబు సమక్షంలో టిడిపిలో ప్రముఖ నటి సన, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, మోసెన్ రాజు తదితరులు చేరారు. రంగనాథ రాజు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నర్సాపురం లోకసభ నియోజకవర్గానికి ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. కాగా, సన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications