జగన్ని నమ్మితే..: పోటీ నుంచి తప్పుకున్నఆదాల
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల బరి నుండి తాను తప్పుకుంటున్నట్లు కాంగ్రెసు పార్టీ రెబల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గురువారం ప్రకటించారు. ముఖ్యమంత్రి కిఱణ్ కుమార్ రెడ్డి తప్పుకోమని సూచించినట్లు చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని నమ్ముకొని పోటీలో ఉండటం మంచిది కాదని భావించడం వల్లే పోటీ నుండి వైదొలగినట్లు చెప్పారు.
జగన్ పార్టీని నమ్ముకొని బరిలో ఉండటం సరికాదని ఆయన అన్నారు. తనకు మద్దతు ఇచ్చిన శాసన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గురువారం కూడా తనకు 22 మంది ఎమ్మెల్యేలు పోన్లు చేసి పోటీలో ఉండమని కోరారనని కానీ వారి మద్దతుతోనే గెలవలేమని ఆదాల చెప్పారు.

కాగా, సమైక్యం పేరుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన తనకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతిస్తుందని ఆయన గట్టిగా భావించారు. సీమాంధ్రకు చెందిన పలువురు కాంగ్రెసు ఎమ్మెల్యేలు కూడా ఓటు వేస్తారని భావించారు. కానీ జగన్ పార్టీ రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించడంతో పాటు ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. మరోవైపు అధిష్టానం కూడా ముఖ్యమంత్రి ద్వారా బరిలో నుండి తప్పించేందుకు చర్యలు చేపట్టింది.
మొన్న చైతన్య రాజు నామినేషన్ ఉపసంహరించుకోగా, ఇప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ నుండి తప్పుకున్నారు. కాంగ్రెసు పార్టీ నుండి కెవిపి రామచంద్ర రావు, టి సుబ్బిరామి రెడ్డి, ఎంఏ ఖాన్, తెలుగుదేశం పార్టీ నుండి గరికపాటి, సీతారామలక్ష్మి, తెలంగాణ రాష్ట్ర సమితి కె కేశవ రావులు పోటీలో మిగిలారు.












Click it and Unblock the Notifications