ఆంధ్రప్రదేశ్: రాజ్యసభ రేసు నుంచి అదానీ ఔట్?
ఆంధ్రప్రదేశ్ నుంచి త్వరలో ఖాళీ అవబోతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి అదానీ గ్రూప్నకు కేటాయించినట్లు విస్తృతంగా వార్తలు వచ్చాయి. నాలుగు స్థానాలు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే పడబోతున్నాయి. అయితే వీటిలో ఒకటి అదానీ గ్రూప్నకు కేటాయించారని, ఆయన కుటుంబం నుంచి ప్రీతి అదానీ రాజ్యసభకు ఎంపిక కాబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ కూడా రావడంతో ఆ ప్రచారం కూడా పతాకస్థాయికి చేరింది. అయితే తాము ఏ పార్టీలో చేరడంలేదని, ఏ సభకు తాము వెళ్లబోవడంలేదంటూ అదానీ గ్రూప్ అధికారికంగా ప్రకటించింది.

ఏ రాజకీయ పార్టీలో చేరడంలేదు!
ఏ రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం తమకు లేదని అదానీ గ్రూప్ ప్రకటించింది. గతంలో రిలయన్స్ గ్రూప్ తరఫున పరిమళ్ నత్వానీ రాజ్యసభకు ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ తరఫున ఎంపిక కావాలని వైసీపీ పెద్దలు షరతు విధించడంతో నత్వానీ వైసీపీ సభ్యత్వం తీసుకొని ఆ పార్టీ తరఫున నామినేషన్ వేసి రాజ్యసభ సభ్యుడయ్యారు.

బీజేపీకి కేటాయిస్తారేమో?
ఇప్పుడు అదానీని కూడా ఇదే తరహాలో ఎంపిక కావాలంటూ వైసీపీ పెద్దలు కోరారు. పార్టీల తరఫున ఎంపిక కావడం ఇష్టం లేని అదానీ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. రాజకీయ పార్టీల్లో ఇమడం ఇష్టంలేని అదానీ రాజ్యసభ రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో అదానీ గ్రూప్నకు ఇవ్వాల్సిన రాజ్యసభ సీటును భారతీయ జనతాపార్టీ తరఫున ఎవరికైనా కేటాయిస్తారేమోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

వైసీసీ రాజ్యసభ సభ్యులపై రెండురోజుల్లో స్పష్టత
నాలుగు రాజ్యసభ స్థానాలకు ఒకటి విజయసాయిరెడ్డిని తిరిగి పంపించాలని జగన్ నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. మరో రెండు స్థానాలు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, నెల్లూరు జిల్లా బీసీ నేత బీద మస్తాన్రావును ఎంపిక చేశారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు అకస్మాత్తుగా అదానీ రేసు నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారో అనే ఉత్కంఠ నెలకొంది. నేతలంతా తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. పారిశ్రామికవేత్తల కోటాలో ఎంపిక చేయాలంటే మైహోం రామేశ్వరరావుకు అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏదేమైనా కానీ రెండు రోజుల్లో వైసీపీ రాజ్యసభ సభ్యులపై ఒక స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications