నేడు ఏపీ సీఎస్గా ఆదిత్యనాథ్ దాస్- సీఎం సలహాదారుగా నీలం బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇవాళ రెండు కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇందులో ప్రధానంగా ప్రస్తుత సీఎస్ నీలం సాహ్నీ పదవీ విరమణ చేస్తుండగా.. ఆమె స్ధానంలో సీఎస్గా మరో సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు చేపడతారు. అలాగే నీలం సాహ్నీ పదవీ విరమణ చేయగానే ముఖ్యమంత్రి జగన్ ప్రధాన సలహాదారుగా బాధ్యతలు చేపడతారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి(సీఎస్)గా ఆదిత్యనాథ్ దాస్ ఈరోజు బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 3:15 గంటలకు ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం మూడు రాజధానుల ప్రక్రియతో పాటు భారీ ఎత్తున ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో ఆదిత్యనాథ్ కీలకం కానున్నారు. విధేయతతో పాటు మెరుగైన పనితీరు, సుదీర్ఘ పాలనా అనుభవం ఉన్న ఆదిత్యనాథ్ను జగన్ సులువుగానే ఎంచుకున్నారు.
అలాగే పదవీ విరమణ చేస్తున్న సీఎస్ నీలం సాహ్నికి అధికారులు నేడు వీడ్కోలు పలకనున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం నేటితో ముగియనున్న నేపథ్యంలో ఆమె స్థానంలో ఆదిత్యానాథ్ దాస్కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. పదవీకాలం పూర్తి అనంతరం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ అడ్వైజర్గా నీలం సాహ్ని విధులు నిర్వర్తించనున్నారు.
సీఎస్గా పదవీ విరమణ చేయబోతున్న నీలం సాహ్నీ కీలక సమయంలో బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని అర్ధాంతరంగా తప్పించిన ప్రభుత్వం నీలంకు బాధ్యతలు అప్పగించింది. ఆమె పదవీకాలం ఎప్పుడో ముగిసినా కరోనా పరిస్ధితుల నేపథ్యంలో ఆమెకు రెండుసార్లు పొడిగింపు ఇచ్చారు. దీంతో ఆమె మరో ఆరు నెలల పదవీకాలం పూర్తి చేసుకుంటున్నారు. నీలం హయాంలో కీలకమైన మూడు రాజధానుల ప్రక్రియతో పాటు హైకోర్టుతో వివాదాలు, ఇతర సమస్యలు ఎదురయ్యాయి. అయినా ఆమె నేర్పుగానే నెట్టుకొచ్చారు. దీంతో సీఎం జగన్ ఆమె సేవలకు మెచ్చి పదవీ విరమణ తర్వాత ప్రధాన సలహాదారుగా బాధ్యతలు అప్పగిస్తున్నారు.