రఫీకాతో సహజీవనం.. ఆమె కూతురు పైనా కన్ను.. గొర్రెకుంట హత్యల్లో అసలు వెర్షన్ ఇదీ..
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో వెలుగుచూసిన హత్యల ఉదంతం రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. పోలీసుల చాకచక్యంగా కేవలం మూడు రోజుల్లోనే కేసును చేధించడంతో మిస్టరీ వీడిపోయింది. సంజయ్ కుమార్ అనే బీహారీ యువకుడే హత్యలకు పాల్పడ్డట్టు పోలీసులు నిర్దారించారు. మక్సూద్ మరదలు రఫీకాతో సహజీవనం చేస్తూనే.. ఆమె కూతురి పైనా సంజయ్ కన్నేసినట్టు తేల్చారు.
వరంగల్ లో వలస విషాదం ... బావిలో శవాలుగా వలస కార్మిక కుటుంబం.. కేసులో కొత్త ట్విస్ట్
ఈ విషయంలో రఫీకా సంజయ్తో పలుమార్లు గొడవపడటంతో.. హత్య చేసి ఆమె అడ్డు తొలగించుకున్నాడు. రఫీకా ఆచూకీ గురించి మక్సూద్ కుటుంబ సభ్యులు పదేపదే ప్రశ్నిస్తుండటంతో.. వాళ్లనూ చంపేయాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే మక్సూద్ కుటుంబంతో పాటు పొరుగునే ఉండే ఇద్దరు బీహారీ యువకులను కూడా హత్య చేశాడు. ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేకపోయినా ఆ ఇద్దరు బీహారీ యువకులు అన్యాయంగా బలైపోయారు.
ఆరేళ్ల క్రితం వరంగల్కు సంజయ్...
బతుకుదెరువు కోసం బీహార్ నుంచి ఆరేళ్ల క్రితం సంజయ్ కుమార్ వరంగల్ వచ్చాడు. మొదట్లో యాదవ్ మిల్స్ కాలనీ ప్రాంతంలో ఉండే శాంతినగర్ గోనె సంచుల తయారీ కేంద్రంలో పనిచేసేవాడు. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే మక్సూద్ కుటుంబంతో సంజయ్కి పరిచయం ఏర్పడింది. మక్సూద్ కుటుంబం 20 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్ నుంచి వలసొచ్చి వరంగల్లోనూ ఉంటూ గన్నీ బ్యాగుల తయారీ కేంద్రంలో పనిచేస్తున్నారు. మూడేళ్ల క్రితం మక్సూద్ భార్య నిషా ఆలం(40) సోదరి కుమార్తె రఫీకా(37) కూడా వరంగల్ వచ్చింది.
సంజయ్తో పరిచయం సహజీవనం..
తన ముగ్గురు పిల్లలతో వరంగల్ వచ్చిన రఫీకా మక్సూద్ కుటుంబంతోనే ఉంటూ గోనె సంచుల ఫ్యాక్టరీలో పనిచేసేది. ఈ క్రమంలో సంజయ్ కుమార్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. సంజయ్కి రఫీకానే భోజనం కూడా వండి పెట్టేది. అలా కొద్దిరోజుల తర్వాత స్తంభంపల్లిలో ఇద్దరూ ఓ అద్దె ఇల్లు తీసుకుని సహజీవనం చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో యుక్త వయస్సుకు వచ్చిన రఫీకా కూతురుతో సంజయ్ సాన్నిహిత్యంగా ఉండేవాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి... తన కూతురుతో చనువుగా ఉండటాన్ని రఫీకా నిలదీసింది. పద్దతి మార్చుకోవాలని హెచ్చరించింది. దీంతో బెంగాల్లో ఉన్న తమవాళ్లతో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని చెప్పి గరీబ్రథ్ రైల్లో ఆమెను తీసుకెళ్లాడు.
అలా రఫీకా హత్య..
మార్చి 6న రైల్లో ప్రయాణిస్తుండగా మార్గమధ్యలో ఓ బటర్ మిల్క్ ప్యాకెట్ కొన్న సంజయ్.. అందులో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. అనంతరం ఇద్దరూ కలిసి ఫుట్ బోర్డ్పై కూర్చొని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తెల్లవారుజామున 3గం. ప్రాంతంలో రైలు ఏపీలోని నిడదవోలు సమీపంలోకి రాగానే... అప్పటికే మత్తులో ఉన్న రఫీకా మెడకు చున్నీతో గొంతు బిగించి హత్య చేశాడు. ఆపై రైలు నుంచి బయటకు తోసేశాడు. అనంతరం రాజమండ్రిలో దిగి ఏమీ తెలియనట్టు మరో రైల్లో వరంగల్ చేరుకున్నాడు. ఇంటికొచ్చాక.. రఫీకాను పశ్చిమ బెంగాల్లోని తమ బంధువుల ఇంటి వద్ద దింపి వచ్చినట్టు చెప్పాడు.
పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించడంతో..
ఒక వారం రోజుల పాటు రఫీకా తిరిగొస్తుందేమోనని మక్సూద్ కుటుంబ సభ్యులు ఎదురుచూశారు. ఆ తర్వాత కొద్దిరోజులకే కరోనా నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. దీంతో సంజయ్ను గట్టిగా నిలదీయడం మొదలుపెట్టారు. రఫీకా ఆచూకీ చెప్పకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మక్సూద్ భార్య నిషా ఆలం బెదిరించింది. దీంతో భయపడ్డ సంజయ్.. రఫీకా హత్యను కప్పి పుచ్చుకోవడానికి మరో 9 హత్యలు చేశాడు. గత బుధవారం(మే 20) మక్సూద్ కూతురు బుష్రా ఆలం కుమారుడు(3) బర్త్ డే పార్టీకి వెళ్లి.. ఆహారంలో నిద్ర మాత్రలు కలిపాడు. అందరూ అపస్మారక స్థితిలోకి వెళ్లాక... గోనె సంచుల్లో చుట్టి బావిలో పడేశాడు. పొరుగునే ఉండే బీహారీ యువకులను తొలుత హత్య చేయవద్దని భావించినప్పటికీ.. వారివల్ల ఎక్కడ దొరికిపోతానేమోనని వాళ్లనూ చంపేశాడు.
చేధించిన పోలీసులు..
మొత్తం 6 దర్యాప్తు బృందాలు మూడు రోజులు నిరంతరం ఈ కేసును చేధించేందుకు పనిచేశాయి. గొర్రెకుంట, వెంకట్రామ థియేటర్ చౌరస్తా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేయడంతో కేసులో పురోగతి వచ్చింది. అలాగే మక్సూద్ ఇటీవల రంజాన్ కోసం వాల్ మార్ట్ నుంచి కొనుగోలు చేసి తెచ్చిన సామాగ్రి సంజయ్ ఇంట్లో పోలీసులు గుర్తించారు. కాల్ డేటా ద్వారా కూడా కొన్ని కీలక ఆధారాలు లభించాయి. వీటన్నింటితో సంజయ్ను గట్టిగా ప్రశ్నించడంతో నేరం అంగీకరించాడు.