అసెంబ్లీ సీట్ల పెంపు- తేల్చి చెప్పిన కేంద్రం : జగన్- కేసీఆర్ సిద్దమేనా..!!
తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంపు ఎప్పుడు. రాష్ట్ర విభజన సమయం నుంచి ఈ అంశం పైన పలు మార్లు చర్చలు జరిగాయి. కేంద్రం సైతం దాటవేస్తూ వచ్చింది. అయితే, ఇప్పుడు జమ్ము కాశ్మీర్ లో కేంద్ర పాలన ఎత్తివేసి రాష్ట్ర హోదా ఇచ్చే క్రమంలో భాగంగా..అసెంబ్లీ సీట్ల పెంపు అంశం పైన కేంద్రం ఫోకస్ చేసింది. జమ్ములో అసెంబ్లీ సీట్ల పెంపు పైన నిర్ణయం తీసుకొనే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోనూ విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ సీట్ల పెంపు పైన నిర్ణయం ఉంటుందని అంచనాలు వినిపించాయి. జమ్ము కాశ్మీర్ తో పాటుగానే తెలుగు రాష్ట్రాల్లోనూ పెంచాలనే డిమాండ్లు వినిపించాయి.

రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్ల పెంపు..
2014లో పార్లమెంట్ లో ఆమోదించిన విభజన చట్టం ప్రకారం ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలను 225 అసెంబ్లీ స్థానాలుగా..అదే విధంగా తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలను 134 స్థానాలకు పెంచుతూ ప్రతిపాదనలు చేసారు. వీటిని పదేళ్ల లోగా అమలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎన్డీఏ తొలి టర్మ్ లో విభజన హామీల అమల్లో భాగంగా..ఈ నిర్ణయం అమలు దిశగా అప్పట్లో కేంద్ర శాఖల తో మంతనాలు జరిపారు. పలుమార్లు న్యాయశాఖతోనూ చర్చలు నిర్వహించారు.

రాజ్యంగా సవరణతోనే సాధ్యం..
అయితే, ఇప్పడున్న పరిస్థితుల్లో సీట్ల పెంపు సాధ్యం కాదని..అందుకు రాజ్యాంగ సవరణ అవసరమని న్యాయ శాఖ అప్పట్లోనే క్లారిటీ ఇచ్చింది. ఇదే అంశాన్ని పలు మార్లు కేంద్రం రాష్ట్రాలకు వివరించింది. చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా..కేసీఆర్ తెలంగాణ సీఎంగా ఇద్దరూ ఆ సమయంలో కేంద్రం పైన ఒత్తిడి చేసారు. కానీ, అవి ఫలించలేదు. రాజ్యంగంలోని ఆర్టికల్ 170లో చెప్పినట్లు 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.

2031 వరకు సీట్ల పెంపు లేనట్లే...
ఇక, ఈ రోజు లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ..టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అసెంబ్లీ స్థానాల పెంపు పైన కేంద్రాన్ని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానం ఇచ్చారు. 2031 లో మాత్రమే మరోసారి జనాభా గణన జరిగే అవకాశం ఉంది. అది పూర్తయిన తరువాత మాత్రమే అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం అవుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ఇక, ఏపీలో సైతం జిల్లాల పెంపుకు సంబంధించి కేంద్రంతో జరిగిన చర్చల్లోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేసారు.

ఏపీలో జిల్లాల పెంపుతో లింకు..
పార్లమెంటరీ -అసెంబ్లీ హద్దులకు లోబడి జిల్లాల పెంపు ఉండాలని ఏపీకి కేంద్రం సూచించింది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ-తెలంగాణలోకి అధికార పార్టీలో అసెంబ్లీ పోటీకి ఆశావాహుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఇదే సమయంలో ఏపీలో శాసన మండలి రద్దు సిఫార్సు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. దీంతో.. ఏపీలో 2024 లోగా అసెంబ్లీ సీట్ల పెంపు జరగాలని అధికార పార్టీ కోరుకుంటోంది. కానీ, బీజేపీకి రాజకీయంగా ఈ రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్ల పెంపు ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదని..దీని కారణంగానే చట్ట సవరణ ద్వారా సీట్ల పెంపుకు ముందుకు రావటం లేదనే విమర్శలు ఉన్నాయి.

కేసీఆర్ - జగన్ ఏం చేయబోతున్నారు..
దీంతో..2024, 2029 ఎన్నికల నాటికి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యమయ్యేలా కనిపించటం లేదు. కానీ, పార్లమెంట్ రెండు సభల్లో తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలకు మంచి సంఖ్య బలం ఉంది. ఇరు రాష్ట్రాల ఎంపీలు కేంద్రం పైన కలిసి కట్టుగా ఒత్తిడి తెస్తే ఫలితం ఉంటుందనే అభిప్రామూ వినిపిస్తోంది. మరి..ఇప్పుడు కేంద్రం మరో సారి 2031 వరకు సీట్ల పెంపు సాధ్యం కాదని తేల్చి చెబుతున్న సమయంలో..ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. అప్పటి వరకు నిరీక్షిస్తారా లేక, ఈ లోగానే కేంద్రం పైన ఒత్తిడి పెంచి సీట్ల పెంపు సాధిస్తారా అనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications