ప్రధాని మోదీ - చంద్రబాబు మంతనాలు : కీలక అడుగులు..!!
సుదీర్ఘ కాలం తరువాత ప్రధాని మోదీ - చంద్రబాబు మధ్య పరస్పరం పలకరించుకున్నారు. ఇద్దరూ కొద్ది సేపు చర్చించుకున్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సీఎం జగన్ ను ఓడించాలి.. అధికరంలోకి రావాలని అడుగులు వేస్తున్న చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా.. ఢిల్లీలోని అధికార ప్రముఖులకు మరోసారి దగ్గరయ్యేందుకు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ప్రధాని పలకరించటం.. ఇద్దరూ మాట్లాడుకోవటం ద్వారా మరసారి భేటీకి సమయం అవకాశం దక్కింది. రాష్ట్రపతి భవన్లోని కల్చర్ సెంటర్ ఇందుకు వేదికగా మారింది.

ప్రధాని - చంద్రబాబు పలకరింపులు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన 'ఆజాదీకా అమృత్ మహోత్సవ్' సమావేశంలో కేంద్ర ఆహ్వానం మేరకు చంద్రబాబు హాజరయ్యారు. టీం టైంలో ప్రధాని అతిధులను అందరినీ పలకరించారు. చంద్రబాబు వద్దకు వచ్చిన ప్రధాని మోదీ ఆయన యోగక్షేమాల పైన ఆరా తీసారు. ఢిల్లీకి రావటం లేదని..అప్పుడప్పుడూ వస్తూ ఉండాలంటూ ప్రధాని కోరినట్లు సమాచారం. దీనికి స్పందనగా మరోసారి వస్తానని.. ప్రత్యేకంగా కలుస్తానంటూ ప్రధానితో చెప్పగా..రండి అంటూ ప్రధాని ఆహ్వానించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అదే సమావేశానికి హాజరైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. గడ్కరీ ఎన్సీపీ నేత శరద్ పవార్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితరులను చంద్రబాబు కలిశారు. ఇదే భేటీలో పాల్గొన్న సినీనటుడు రజనీకాంత్, పీటీ ఉషతో పాటు పలువురు ప్రముఖులు చంద్రబాబును పలకరించారు.

మరోసారి కలవాలని నిర్ణయం
2019 ఎన్నికల సమయంలో నాడు జగన్ అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు చంద్రబాబు రివర్స్ అమలు చేస్తున్నారు. కేంద్రం నుంచి రాజకీయంగా జగన్ కు మద్దతు లేకుండా చేయాలనేది తన టార్గెట్ 2024 లో వ్యూహంగా తెలుస్తోంది. అందులో భాగంగా.. ఎన్డీఏ కోరకపోయినా రాష్ట్రపతి - ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ప్రధాని పలకించిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరోసారి కలిసేందుకు అవకాశం దక్కించుకున్నారు. దీని ద్వారా రానున్న రోజుల్లో ఢిల్లీ కేంద్రంగా తిరిగి కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యలకు దగ్గరయ్యే ప్రయత్నాలను మరోసారి చంద్రబాబు ముమ్మరం చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామాలను అటు వైసీపీ నేతలు నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఢిల్లీలోనే సీఎం జగన్.. నేడు కీలక సమావేశం
సీఎం జగన్ కు ఈ కార్యక్రమానికి ఆహ్వానం ఉన్నా..జగన్ హాజరు కాలేదు. ఈ రోజు జరిగే నీతి అయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం జగన్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు ప్రధానితోనూ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇక, చంద్రబాబు ఢిల్లీ కేంద్రంగా మీడియాతో ఇష్ఠాగోష్టీ నిర్వహించారు.జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. జనం నాడి తెలిసి జగన్ ఆందోళనలో ఉన్నారని వ్యాఖ్యనించారు. అనేక విపత్తులు ఎదురైనా మనదేశం ధైర్యంగా నిలబడిందని అన్నారు. అనేక దేశాల కంటే మనదేశ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు త్వరలోనే మరసారి ఢిల్లీ వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications