జనసేనలోకి ప్రకాశ్ రాజ్ - వైసీపీ టార్గెట్..దేనికంటే: పవన్ కళ్యాణ్ సై - కండీషన్స్ అప్లై...!!
ఇప్పటి వరకు "మా" అధ్యక్ష బరిలో నిలిచి తెలుగు ప్రజలతో పాటుగా అందరిని ఆకర్షించిన ప్రకాశ్ రాజ్ ఇప్పుడు రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన తెలుగు వారు కాదు ..అంటూ సాగిన ప్రచారం తనను ఓటమి పాలు చేసిందని ప్రకాశ్ రాజ్ బలమైన అభిప్రాయంతో ఉన్నారు. అటువంటి సంకుచిత అభిప్రాయాలు ఉన్నందుకే తాను "మా" సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా మెగా బ్రదర్ నాగబాబు ప్రకటించారు. అయితే, తాను తెలుగు గడ్డ పైన పుట్టకపోయినా..ఇక్కడి ప్రతీ ఇంటికి తానెవరో తెలుసని..తెలుగు ప్రేక్షకులు ఆదరించారని చెబుతున్నారు.
ప్రకాశ్ రాజ్ కీలక నిర్ణయం దిశగా..
"మా" ఎన్నికల్లో ఓడిన తాను అసలు ఆట మొదలవుతుంది అంటూ కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు. అయితే, ప్రకాశ్ రాజ్ ఇప్పుడు కొత్త అడుగులు వేయబోతున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించినట్లు గా సమాచారం. ప్రకాశ్ రాజ్ బెంగుళూరులో నాలుగేళ్ల క్రితం జరిగిన జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య ఘటనతో బీజేపీ పైన వ్యతిరేకంగా ఉద్యమం చేసారు. ఇక, ప్రధాని మోదీ విధానాలను వ్యతిరేకించే ప్రకాశ్ రాజ్ 2019 ఎన్నికల్లో బెంగుళూరు సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినా..పలు సందర్భాల్లో మోదీకి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. "మా" ఎన్నికల బరిలో దిగిన తరువాత పూర్తిగా గెలుపు మీదనే ఫోకస్ చేసారు.
ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ..!!
ఇక, ఈ ఓటమికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్న ప్రకాశ్ రాజ్...రాజకీయంగా అది సాధ్యమని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రకాశ్ రాజ్ కు మెగా క్యాంపు మద్దతుందని స్వయంగా నాగబాబు చెప్పుకొచ్చారు. కొన్ని టీవీ ఛానళ్ల ఇంటర్వ్యూల్లో మోహన్ బాబు సైతం వెల్లడించారు. రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక వేదికగా పవన్ కళ్యాణ్ సైతం ప్రకాశ్ రాజ్ పైన చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. ఇక, మోహన్ బాబు - నరేశ్ పైన ప్రకాశ్ రాజ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. విష్ణు గెలిచేందుకు తెర వెనుక వైసీపీ మద్దతు ఉందనే ప్రచారం కొద్ది రోజులుగా టాలీవుడ్ లో వినిపిస్తోంది.
రాజకీయంగా పవన్ తో విభేదాలు పక్కన పెట్టి
దీని పైన స్వయంగా మంత్రి పేర్ని నాని స్పందించారు. "మా" ఎన్నికలకు ఏపీ ప్రభుత్వానికి..వైసీపీకి సంబంధం లేదని స్పష్టం చేసారు. అయితే, ఇప్పుడు ప్రకాశ్ రాజ్ తాను రాజకీయంగా సక్సెస్ అవ్వాలంటే... జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. దీని పైన ప్రాధమికంగా చర్చలు సైతం జరిగినట్లు చెబుతున్నారు. అయితే.. బీజేపీతో జనసేన పొత్తు అంశం ఇప్పుడు ప్రకాశ్ రాజ్ కు ఇబ్బందిగా మారుతోంది. అయితే, బీజేపీ - జనసేన మధ్య పొత్తు వ్యవహారంలోనూ అంత సఖ్యత కనిపించటం లేదు.
జనసేనలో చేరుతారంటూ ప్రచారం..
ఎవరి నిర్ణయాలు వారివే అనే తరహాలో ముందుకు సాగుతున్నారనే అభిప్రాయం ఉంది. కేసీఆర్ పైన సదాభిప్రాయం తో ఉన్న ప్రకాశ్ రాజ్ ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా..జనసేనలో పని చేయాలని నిర్ణయించినట్లుగా టాలీవుడ్ టాక్. దీని పైన కొందరు ముఖ్యులతో చర్చిస్తున్నట్లుగా చెబుతున్నారు. గతంలో పవన్ కళ్యాన్ - ప్రకాశ్ రాజ్ మధ్య బేధాభిప్రాయాలే కానీ, విభేదాలు లేవని పవన్ - ప్రకాశ్ రాజ్ ఇద్దరూ స్పష్టం చేసారు. దీంతో...జనసేనలో చేరి ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలనేది ప్రకాశ్ రాజ్ లక్ష్యంగా తెలుస్తోంది.
బీజేపీతో పొత్తు అంశమే అడ్డంకిగా..
పవన్ సైతం ప్రకాశ్ రాక పైన అభ్యంతరాలు లేకపోయినా..బీజేపీతో సంబంధాల పైనే ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. దీంతో..సరైన సమయంలో బీజేపీ - జనసేన పొత్తు అంశం పైన స్పష్టత పూర్తిగా వచ్చిన తరువాత ప్రకాశ్ రాజ్ అధికారికంగా జనసేనలో చేరుతారని ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్. ఇంకా సార్వత్రిక ఎన్నికలకు సమయం ఉండటం.. పవన్ సైతం సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. అదే విధంగా ప్రకాశ్ రాజ్ చేతిలోనూ సినిమాలు ఉన్నాయి.
ఎన్నికల నాటికి ఎంట్రీ పక్కా అంటూ..
వీటిని పూర్తి చేసుకొని అధికారికంగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వటానికి ప్రకాశ్ రాజ్ సిద్దమవుతున్నారని తెలుస్తోంది. అదే జరిగితే.. జనసేన నుంచి వచ్చే ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ జనసేన కు స్టార్ క్యాంపెయినర్ గా మారే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు కాకుండా సరైన సమయంలో జనసేనలోకి అఫీషియల్ గా ఎంట్రీ ఇచ్చి..ఏపీ నుంచి పోటీ చేయాలనేది ప్రకాశ్ రాజ్ ఆలోచనగా ప్రచారం సాగుతోంది. దీంతో..ప్రకాశ్ రాజ్ జనసేనలో చేరితే "మా" తో మొదలైన సినిమా పెద్దల వివాదం కొత్త టర్న్ తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.