సొమ్ము ముట్టిందిగా.., బాబుని అంటే: జగన్పై భూమా తీవ్ర వ్యాఖ్యలు
కర్నూలు: కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నిప్పులు చెరిగారు. తెలంగాణలో వైసిపి నేతలు కాంట్రాక్టులు తీసుకున్నారని ఆని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాంట్రాక్టుల సొమ్ము ముట్టిన తర్వాత ఏపీలో జలదీక్షలు చేస్తూ కొత్త డ్రామాలకు జగన్ తెర తీస్తున్నారన్నారు. రాజకీయం వేరు, వ్యాపారం వేరు అంటే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు వైసిపికి పట్టవా అని నిలదీశారు.
వైయస్ జగన్ రాజకీయ కోణంలో కాకుండా ప్రజలకు మంచి చేసే ఆలోచన చేయాలన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. అందరం కలిసిమెలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామన్నారు. ప్రతిపక్ష నేతగా మీ పాత్రలో మీరు పని చేయాలన్నారు.
అలాగే, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తన పని తాను నిర్వహిస్తారని చెప్పారు. ఇప్పటికైనా జగన్ ఆలోచన మారాలన్నారు. రాజకీయ కోణంలో ఆలోచించడం సరికాదన్నారు. ప్రత్యేక హోదా, అక్రమ ప్రాజెక్టుల పైన జగన్ ఢిల్లీకి వెళ్లి పోరాడాలన్నారు.
కొట్లాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని జగన్ అనుకోవడం సరికాదన్నారు. అన్నింటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలన్నారు. చంద్రబాబుకు ఓర్పు, సహనం ఉన్నాయని, ఆయన అన్నింటి పైన దృష్టి సారిస్తున్నారన్నారు.
ఏ క్షణాల్లో అయినా ప్రత్యేక హోదా పైన కేంద్రంలో మార్పు రావొచ్చన్నారు. చంద్రబాబు సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దన్నారు. తెలంగాణలో అక్రమ ప్రాజెక్టుల కాంట్రాక్టులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకే దక్కినట్లుగా ఆరోపణలు ఉన్నాయన్నారు.
ఓ వైపు తెలంగాణ కట్టేది అక్రమ ప్రాజెక్టులను జగన్ చెబుతూనే, తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణాన్ని జగన్ తన వారికి ఇవ్వడం విడ్డూరమన్నారు. వారు సవాల్ చేసినప్పుడు వాటిని నిరూపించేందుకు తాము సిద్ధమని చెప్పారు. భూమా టిడిపి తీర్థం పుచ్చుకున్నాక తీవ్ర విమర్శలు చేయడం ఇదే మొదటిసారి.