కేఈ తర్వాత బాబుకు పతివాడ షాక్: మంచివారంటూనే ఇక్కడే ఉంచారు
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు మరో షాక్ తగిలింది. కర్నూలులో తక్కువ సీట్లు వచ్చాయని చంద్రబాబు తమ పైన దృష్టి సారించడం లేదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు మరవకముందే మరో నేత అసంతృప్తి వ్యక్తం చేశారు.
విజయనగరం జిల్లా మినీ మహానాడులో టీడీపీ సీనియర్ నేత పతివాడ నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లా వాసులను సీఎం మంచివారు అని అంటుంటారని, అందుకే మమ్మల్ని ఇక్కడే ఉంచారని సెటైర్ వేశారు.
తనకు పదవి రాకపోవడంపై ఆయన పైవిధంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య కళాశాల విషయంలో చంద్రబాబు మాటల్లో స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలన్నారు.
కాగా, శనివారం నాడు కేఈ కృష్ణమూర్తి, చంద్రబాబు నాయుడుల మధ్య పరోక్ష మాటల యుద్ధం సాగిన విషయం తెలిసిందే. చంద్రబాబు దృష్టంతా పశ్చిమ గోదావరి పైనే ఉందని, కర్నూలుపై అస్సలు లేదని కేఈ వ్యాఖ్యానించారు. తమనెప్పుడూ పశ్చిమ గోదావరి జిల్లా 16 సీట్లు ఇచ్చిందని, కర్నూలులో మూడు సీట్లే వచ్చాయని, మిగతా 11 ఏమయ్యాయని ప్రశ్నించడం బాధ కలిగిస్తోందన్నారు.
కర్నూలులో శనివారం జరిగిన తెలుగుదేశం మినీ మహానాడు వేదికపై నుంచి ఆయన చంద్రబాబుపై ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. గల్లీలే తెలియని లీడర్ను పార్టీ జిల్లా అధ్యక్షుడిని చేయడం సాహసమేనన్నారు. దీనిపై చంద్రబాబు కూడా ఘాటుగా స్పందించారు.
చేసిన పనులు అర్థం చేసుకోవాలని హితవు పలికారు. కర్నూలు జిల్లాను చరిత్రలో ఎవరూ చేయనంతగా అభివృద్ధి చేశానని, కాదని ఏ పార్టీకి చెందిన వారైనా చెప్పగలరా అని సవాల్ విసిరారు. మంత్రులు నేను చేసిన పనులను అర్థం చేసుకుని తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. పట్టిసీమ ఎత్తిపోతలు నిర్మించి కృష్ణా డెల్టాకు సాగునీరు అందిస్తామని, శ్రీశైలం నుంచి రాయలసీమకు నీరిస్తామన్నారు.