నాగార్జున, పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్: బిజెపివైపు వారి చూపు
హైదరాబాద్: టాప్ హీరోలు ప్రభావం సీమాంధ్ర నేతల పైన పడుతోందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఐదు రోజుల క్రితం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, నిన్న యువసామ్రాట్ అక్కినేని నాగార్జునలు గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసిన తర్వాత మరికొంతమంది నేతలు కమలం వైపు చూస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో పలువురు సీమాంధ్ర కాంగ్రెసు నేతలు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో బిజెపిలోకి క్రమంగా వలసలు పెరుగుతున్నాయి. అయితే, ఇటీవల చేరిన ప్రముఖ నేతల్లో మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు సినీ తారలు జీవితా రాజశేఖర్ తదితరులు ఉన్నారు. కృష్ణం రాజు వంటి వారు చేరినా వారికి అంతకుముందు బిజెపితో అనుబంధం ఉంది.

అయితే, బిజెపి వైపు ఇంత వరకు చూడని పురంధేశ్వరి లాంటి వారు ఇప్పుడు ఆ పార్టీ వైపు చూస్తున్నారు. రెండు రోజుల క్రితం టిడిపిలో చేరిన జెసి దివాకర్ రెడ్డి కూడా ఓ సమయంలో బిజెపిలో చేరడమే ఉత్తమమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చినప్పటికీ సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం బిజెపి పాటుపడిందనే సానుభూతి ప్రజల్లో ఉందని అంటున్నారు.
దీనికి తోడు నాగ్, పవన్ భేటీలు నేతలను పునరాలోచించేలా చేస్తున్నాయని అంటున్నారు. పురంధేశ్వరి లాంటి నేతలు బిజెపిలో చేరినప్పుడు... కొందరు సీమాంధ్ర కాంగ్రెసు నేతలు లాజిక్ లాగారు. విభజన తప్పని బిజెపిలో చేరిన వారు... బిల్లుకు ఆ పార్టీ మద్దతిచ్చిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. కానీ, పవన్ కళ్యాణ్, నాగార్జునలు మోడీతో భేటీ అయిన తర్వాత ఆ ప్రశ్నకు తావివ్వకుండా బిజెపి వైపు చూస్తున్నారని అంటున్నారు.
బిజెపి బలం క్రమంగా పుంజుకోవడంతో పాటు స్టార్ల మద్దతుతో లబ్ధి చేకూరుతుందని పలువురు భావిస్తున్నారు. కావూరి, బొత్స వంటి వారు బిజెపి వైపు చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాంగ్రెసు నాయకులే కాకుండా ఇతర పార్టీల వారు కూడా బిజెపి వైపు చూస్తున్నారంటున్నారు. వివిధ పార్టీల రాజకీయ నేతలతో పాటు టిక్కెట్లు ఆశిస్తున్న పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులు ఆ పార్టీలో చేరేందుకు ఉత్సాహపడుతున్నారంటున్నారు.












Click it and Unblock the Notifications