మళ్లీ భగ్గుమన్న ఉద్యమకారులు.. మరో వైసీపీ ఎమ్మెల్యే ఘెరావ్.. తోట్లవల్లూరు వద్ద అడ్డగింత
రాజధానిని తరలించొద్దంటూ అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు మంగళవారం హింసాత్మకంగా మారాయి. ఉదయం గుంటూరు జిల్లా చినకాకాని వద్ద ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్ల రామక్రిష్ణా రెడ్డిని అడ్డగించి, ఆయన కారును ధ్వంసం చేసిన నిరసనకారులు.. సాయంత్రం కృష్ణా జిల్లా పామర్రు వైసీపీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్పైనా దాడికి యత్నించారు. రైతుల నిరసనలకు సంఘీభావం తెలపడానికి వచ్చిన టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ ను పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఈ ఘటన జరిగింది.
అరెస్టు చేసిన తర్వాత లోకేష్ను తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారనే సమాచారంతో అటుగా దూసుకెళ్లిన నిరసనకారులు.. స్టేషన్ ను ముట్టడించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడికి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. అదే టైమ్ లో పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ రావడంతో ఆయను ఆందోళనకారులు ఘెరావ్ చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సొమ్మసిల్లి కూలబడిపోయారు. పరిస్థితి చేయిదాటుతుండటంతో పోలీసులు లాఠీ చార్జి చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు.

తనపై దాడికి యత్నించింది అమరాతి రైతులు కారని, వాళ్ల ముసుగులో వచ్చిన టీడీపీ కార్యకర్తలేనని ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఆరోపించారు. ఉదయం పిన్నెల్లిపై దాడి కూడా టీడీపీ నేతల పనే అన్నారు. అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి కోసం సీఎం జగన్ మూడు రాజధానుల ఆలోచన చేశారని, అమరావతిలో రాజధానిని కొనసాగిస్తున్నప్పటికీ, టీడీపీ నేతలు ప్రజల్లో లేనిపోని భయాలు క్రియేట్ చేస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications