బండెనక బండి కట్టి.. 16 బళ్లు కట్టి..!!
బండెనక బండి కట్టి.. 16 బళ్లు కట్టి ఏ పల్లెకు పోతావు కొడకో.. అనే పాట ఏపీ పల్లెల్లో, పట్టణాల్లో మార్మోగబోతోంది. రాజకీయ నాయకుల పాదయాత్రల అడుగుల చప్పుడు నుంచి వచ్చే సవ్వడులు వినడానికి ప్రజానీకం సమాయత్తమవబోతోంది. ప్రతి సంక్రాంతికి కొత్త సినిమాలు విడుదలవడం ఆనవాయితీ. రైతు పొలంలో పండించిన తన పంటను ఇంటికి తీసుకువచ్చే శుభ సమయం కాబట్టి అన్ని పండగల్లో సంక్రాంతి పర్వదినం పెద్ద పండగగా నిలిచింది. ఎవరు ఏ పని ప్రారంభించినా సంక్రాంతి రోజు ప్రారంభించడమనేది శుభ సూచికంగా భావిస్తారు.

27 నుంచి నారా లోకేష్ యాత్ర
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ ఏ క్షణంలోనైనా ముందస్తు జరుగుతాయన్నట్లుగా రాజకీయ వాతావరణం ఉంది. దీంతో అన్ని పార్టీలు తమ తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. అందరికన్నా ఎక్కువగా పార్టీలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేలా చేయడానికి పాదయాత్రలే మంచి మార్గమని భావిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జనవరి 27వ తేదీ నుంచి పాదయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. కుప్పం నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర కోస్తా మీదగా పయనించి ఉత్తరాంధ్రలోని ఇచ్ఛాపురం వద్ద ముగియబోతోంది. 4వేల కిలోమీటర్ల రోడ్ మ్యాప్ ను ఆయన సిద్ధం చేసుకుంటున్నారు.

సంక్రాంతి తర్వాత బస్సు యాత్ర
జనసేన అధినేత పవన్ కల్యాణ్ గతంలోనే పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. అయితే ఒప్పుకున్న సినిమాలను పూర్తిచేయాల్సి ఉండటంతో వాటి విరామం సమయంలో బస్సు యాత్ర చేయడానికి మొగ్గు చూపారు. విజయదశమి నుంచే బస్సు యాత్ర ప్రారంభమవ్వాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాలవ్ల జనవరి నుంచి యాత్ర ప్రారంభించేలా సన్నాహాలు చేసుకుంటున్నారు. సంక్రాంతి తర్వాత ఆయన బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు.

కాంగ్రెస్ ను మరిచిపోయిన ప్రజలు
ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటుందనే విషయాన్ని ప్రజలు మరిచిపోయారు. విభజన పేరుతో ప్రజలకు ఆ పార్టీ చేసిన గాయం అలాంటిది. తమకు స్థిరమైన ఓటుబ్యాంకు ఉందని, దాన్ని పునాదిగా వేసుకొని పార్టీని బలోపేతంచేస్తామని అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ప్రకటించారు. డిసెంబరు నుంచి పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు. విభజన హామీల ప్రకారం ఏపీకి మేలు చేయగలిగేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని, అందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని కోరుతున్నారు.

6 నెలలపాటు బీజేపీ నేతల పాదయాత్ర
భారతీయ జనతాపార్టీ కూడా ఇటీవలే అమరావతి గ్రామాల్లో పాదయాత్ర చేసింది. తర్వాత ఇంతవరకు ఒక్క కార్యక్రమం చేపట్టలేదు. తన ఉనికిని కాపాడుకునేందుకు పాదయాత్రకు సిద్ధపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీకి చెందిన నేతలు కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో యాత్రలు చేస్తారు. సంక్రాంతి తర్వాత నుంచి 6 నెలలపాటు ఈ యాత్ర ఉండబోతోందని, తమది వ్యక్తిగత యాత్ర కాదని, పార్టీ కోసం చేసే యాత్ర అని బీజేపీ నేతలు వెల్లడించారు.

నమ్ముకున్నవారిని మోసం చేయని పాదయాత్ర
పాదయాత్ర.. తనను నమ్ముకున్నవారిని ఎప్పుడూ మోసం చేయలేదు. 2004లో దివంగత వైఎస్ ను ముఖ్యమంత్రిని చేసింది. అదే పాదయాత్ర 2014లో విభజిత ఏపీని చంద్రబాబు చేతిలో పెట్టింది. తిరిగి అదే యాత్ర వైఎస్ తనయుడు జగన్ కు కూడా అధికారాన్ని కట్టబెట్టింది. పాదయాత్రను నమ్ముకున్నవారెవరూ నిరాశకు గురైన సందర్భాలే లేవు. మరి ఈసారి ఏపీలో జరగబోతున్న పాదయాత్రలు ఎవరికి విజయాలను చేకూర్చిపెడతాయో వేచిచూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications