తెలంగాణ భుజం మీద తుపాకీ ఉంచి ఏపీకి గురిపెట్టిన బీజేపీ??
వాజ్పేయీ, అద్వానీ నేతృత్వంలోని భారతీయ జనతాపార్టీ వేరు.. నరేంద్రమోడీ, అమిత్ షాల సారథ్యంలోని భారతీయ జనతాపార్టీ వేరు. ఒకే ఒక్క ఓటు తేడాతో కేంద్రంలో ఐదు సంవత్సరాల అధికారాన్ని కోల్పోయామన్న కసి ఈరోజు ఆ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేలా చేస్తోంది. అంతిమంగా తమకు అధికారమే కావాలి.. అది ఎలాగైనా పర్వాలేదు అన్నరీతిలో ఈ నేతలిద్దరూ పార్టీని విస్తరించుకుంటూ వెళుతున్నారు. అయితే అంతటి ఘనాపాఠీలకు కూడా దక్షిణాది మాత్రం కొరకరాని కొయ్యగా మారింది.

మూడోసారి అధికారం చేజిక్కించుకునే దిశగా..
వరుసగా రెండుసార్లు కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని ఈ ద్వయం ముందుగానే అంచనా వేసింది. ఎక్కడెక్కడ సీట్లు తగ్గుతాయో గ్రహించి తమకు బలం లేనిచోట నుంచి ఆ సీట్లను దక్కించుకొని ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టాలనే ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. ఇందుకు పునాది.. తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవడం. ఈ రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకుంటే దీనికి కవల పిల్లలాంటి ఏపీలో కూడా సులువుగా అధికారాన్ని ఒడిసిపట్టవచ్చనే యోచనలో మోడీ, అమిత్ షా ఉన్నారు.

ముందుగా ఏపీలో బలపడి..
తమకు అంతుచిక్కకుండా ఉన్న దక్షిణాది ఓటర్ల మనస్తత్వాన్ని అంచనా వేసి కర్ణాటకలో ముందుగా అధికారాన్ని దక్కించుకున్నారు. కర్ణాటకతో సరిహద్దులు పంచుకునే తెలంగాణలో పాగా వేస్తే. ఈ రాష్ట్రంతో సరిహద్దులు పంచుకునే ఏపీని గెలుచుకోవచ్చు. అందులో భాగమే అమిత్ షా తాజాగా జరిపిన భేటీలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోను ప్రాబల్యం చూపిస్తున్న సామాజిక వర్గాన్ని దరిచేర్చుకొని పార్టీని బలోపేతం చేసుకోవాలనుకుంటున్నారు.

దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగానే భేటీ
దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగానే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ను కలవడం జరిగింది. ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీతో పొత్తు గురించి ఆలోచన చేసినప్పటికీ అది తాత్కాలికమే అవుతుంది. అంతిమంగా 2029 ఎన్నికల్లో ఏపీలో సొంతంగా అధికారంలోకి రావాలి అనేది బీజేపీ పెద్దల యోచనగా ఉంది. అందుకు ఇప్పటినుంచే పునాది వేసుకుంటున్నారు. 2029 నాటికి చంద్రబాబు యాక్టివ్గా ఉండరని, తద్వారా నాయకత్వ లోపంతో ఆ పార్టీ బలహీనపడుతుందని అంచనా వేశారు. అలా బలహీనపడిన పక్షంలో కమ్మ సామాజికవర్గాన్ని బీజేపీవైపు చూసేలా చేయాలనే ప్రణాళిక ఇమిడి ఉంది. ఎలాగూ కాపు సామాజికవర్గానికి చెందిన పవన్ కల్యాణ్ మిత్రపక్షంగా కొనసాగుతున్నారు.

అంతిమంగా దక్కాల్సింది అధికారమే
ఈ రెండువర్గాల దన్నుతో 2029 ఎన్నికల్లో బీజేపీ ఏపీని చేజిక్కించుకోవాలనుకుంటోంది. తెలంగాణ కోసం ఇప్పుడు గట్టిగానే పోరాడుతున్నామని, అన్నీ అనుకూలిస్తే అధికారం తథ్యమని, లేదంటే 2028 ఎన్నికల్లో సింగిల్గా తెలంగాణను దక్కించుకోగలమనే ధీమాతో బీజేపీ ఉంది. తర్వాత ఏడాది జరిగే ఎన్నికల్లో ఏపీని కూడా చేజిక్కించుకోవచ్చనే భవిష్యత్తు ప్రణాళిక బీజేపీ అధిష్టానంలో ఇమిడి ఉంది. మారనున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా పొత్తు.. లేదంటే సొంతంగా అధికారం ఈ రెండు అంశాలే ప్రాతిపదికగా బీజేపీ పనిచేస్తోంది. పొత్తుల్లో భాగంగా అధికారంలోకి వచ్చినప్పటికీ సింగిల్గా పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ఆ పార్టీ దగ్గర మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రణాళికలు ఎప్పటికీ సిద్ధంగానే ఉంటాయి.












Click it and Unblock the Notifications