AP Govt: డిప్యుటేషన్లపై స్వర్ణగ్రామం, స్వర్ణవార్డు ఉద్యోగుల ఫైర్..! కీలక నిర్ణయం..!
ఏపీలోని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల హేతుబద్దీకరణ తర్వాత అక్కడ మిగులు ఉద్యోగుల్ని ఇతర శాఖలకు డిప్యుటేషన్లపై పంపాలన్న ప్రభుత్వ (AP govt) నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. స్వర్ణవార్డు, స్వర్ణగ్రామం (swarna gramam Swarna ward) శాఖలో ఉన్న తమను ఇప్పుడు ఇతర శాఖలకు పంపితే అక్కడ తాత్కాలిక ఉద్యోగులుగా అవమానాలు తప్పవనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. దీంతో ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని వారు నిర్ణయించారు.
స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల్లో పనిచేస్తున్న తమకు శాశ్వత పరిష్కారమైన ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతుంటే, డిప్యూటేషన్ల పేరుతో కొత్త గందరగోళానికి ఎందుకు తెరలేపుతున్నారని ఉద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అది కూడా ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులను మరో డిపార్ట్మెంట్లోకి డిప్యూటేషన్పై పంపడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నారు. ఉదాహరణకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారిని సోషల్ వెల్ఫేర్ లేదా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లకు పంపితే, అక్కడ ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

రెవెన్యూ ఉద్యోగులైనా, వెల్ఫేర్ ఉద్యోగులైనా, అందరూ తమ సహోద్యోగులేని, ఈ విధమైన నిర్ణయాలతో ఉద్యోగుల మధ్య అనవసరమైన అపోహలు, విభేదాలు ఎందుకు సృష్టిస్తున్నారనేదే ఇక్కడ ప్రశ్న అంటున్నారు. ఇన్ని రోజులు వెల్ఫేర్ డిపార్ట్మెంట్లలో సేవలందించిన ఉద్యోగులు డిప్యూటేషన్ల విషయంలో ఎందుకు గుర్తుకు రాలేదని అడుగుతున్నారు. ఒకవేళ డిప్యూటేషన్లు ఇవ్వాల్సి వచ్చినా, అవి స్పష్టమైన విధానం, న్యాయం, పారదర్శకత ఆధారంగా ఉండాలంటున్నారు. ఇక్కడ అసలు సమస్య ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగులు కాదని,గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తున్నది ఎవరు? ఉద్యోగులను ఉద్యోగులతోనే ఎదురెదురుగా నిలబెడుతున్నది ఎవరు? తమలో అంతర్గత చిచ్చు పెడుతున్నది ఎవరని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దీనికి నిరసనగా సోమవారం ఉద్యోగులందరూ డిప్యూటేషన్ల పేరుతో జరుగుతున్న ఈ అన్యాయంపై గ్రీవెన్స్లో వినతి పత్రాన్ని ఇవ్వాలని నిర్ణయించారు.














Click it and Unblock the Notifications