రఘురామ ప్రభ తగ్గిందా ? లైట్ తీసుకుంటున్న వైసీపీ-అటకెక్కిన అనర్హత-అంతా గప్ చుప్
ఏపీలో వైసీపీ వర్సెస్ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుగా సాగిన పోరు కాస్తా ఏకపక్షంగా మారిపోయింది. 2019 ఎన్నికల్లో గెలుపు తర్వాత ఆరునెలలకు వైసీపీపై పోరు మొదలుపెట్టిన రఘురామరాజు.. ఇప్పటికీ అదే జోష్ తో విమర్శలు చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఫామ్ లో ఉండగా.. రఘురామ విమర్శల్ని, వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు ఆయనపై స్పందించేందుకే ఇష్టపడటం లేదు. అంతేకాదు పార్లమెంటులో ఆయన అనర్హత వేటుపై ఫిర్యాదును సైతం పక్కనబెట్టేసినట్లు తెలుస్తోంది.

జగన్ వర్సెస్ రఘురామ పోరు
దాదాపు ఏడాదిన్నర కాలంగా సాగిన వైఎస్ జగన్ వర్సెస్ రఘురామరాజు పోరు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో బాగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా 2019 చివర్లో వైసీపీ ప్రభుత్వంతో విభేదించడం మొదలుపెట్టిన రఘురామరాజు ఆ తర్వాత టీడీపీ అనుకూల మీడియా సాయంతో ఆ పోరును మరో రేంజ్ కు తీసుకెళ్లారు. నిత్యం సీఎం జగన్ కు లేఖలు రావడం, విమర్శలు చేయడం, ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా రెబెల్ ఎంపీగా పేరు తెచ్చుకున్నారు. చాలా సందర్భాల్లో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే విధంగా వైసీపీ ఇచ్చిన హామీల అమలుతో పాటు కరెంట్ అఫైర్స్ ను సైతం రఘురామ తెరపైకి తెచ్చారు. దీంతో ఓ దశలో జగన్ వర్సెస్ రఘురామ పోరు హాట్ టాపిక్ గా సాగింది. ఆ తర్వాత జగన్, సాయిరెడ్డి బెయిళ్ల రద్దు కోరుతూ సీబీఐ కోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్లతో ఈ పోరు పతాకస్ధాయికి చేరింది.

వైసీపీ సర్కార్ పై పోరుబాట
వైసీపీ సర్కార్ అనుసరిస్తున్న దాదాపు ప్రతీ విధానంపైనా రఘురామ తనదైన శైలిలో విమర్శలు సాగించేవారు. చాలా సార్లు వ్యక్తిగత అంశాల్ని సైతం తెరపైకి తెచ్చి హైలెట్ చేసేందుకు ప్రయత్నించేవారు. ఆయనకు టీడీపీ అనుకూల మీడియా మద్దతుగా ఉండేది. దీంతో రఘురామ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఓ దశలో రఘురామ ఏం మాట్లాడినా హైలెట్ అయ్యే పరిస్ధితి వచ్చేసింది. ఇది అంతిమంగా వైసీపీ సర్కార్ కు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. రఘురామ వ్యాఖ్యల్ని టీడీపీతో పాటు మిగతా విపక్షాలు సైతం వాడుకుని జగన్ సర్కార్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి. దీంతో వైసీపీకి ఇబ్బందులు తప్పలేదు.

జాతీయ స్ధాయిలోనూ పోరు
రాష్ట్రంలో తమను ఇరుకునపెడుతున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. అటు జాతీయ స్దాయిలోనూ వైసీపీ ప్రభుత్వ విధానాన్ని వివిధ రాజకీయ పార్టీల దృష్టికి, గవర్నర్లు, ఎంపీల దృష్టికి తీసుకెళ్లడం మొదలుపెట్టేశారు. సీఎం జగన్ కు లేఖలు రాస్తున్న సమయంలోనే వారికి కూడా వరుసగా లేఖలు సంధించారు. దీంతో రఘురామరాజు ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా పార్లమెంటులో ఎక్కువసార్లు మాట్లాడకపోయినా వైసీపీ ప్రభుత్వంపై, జగన్ పై ఆయన చేసిన విమర్శల్ని జాతీయ పార్టీలు పట్టించుకోవడం మొదలుపెట్టాయి. దీంతో వైసీపీ ఇరుకునపడింది.

రఘురామ అనర్హత వేటు వ్యవహారం
రాష్ట్ర, జాతీయ స్ధాయిలో వైసీపీని, సీఎం జగన్ ను టార్గెట్ చేస్తున్న రఘురామ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఆయనపై ఫిరాయింపుల ముద్ర వేసి అనర్హుడిని చేయాలని వైసీపీ నిర్ణయించింది. దీంతో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు రఘురామపై ఫిర్యాదు చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామపై వేటు వేయాలని పదే పదే డిమాండ్ చేసింది. అయినా పట్టించుకోకపోవడంతో పార్లమెంటు సమావేశాల్లో నిరసన తెలుపుతామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరికలు కూడా పంపారు. దీనిపైనా లోక్ సభ స్పీకర్ కు రఘురామ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రఘురామకు అనర్హత వేటుపై వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ నోటీసులు పంపారు. వివరణ ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత అంతా గప్ చుప్.

వైసీపీకి బ్రేక్ దొరికింది అక్కడే
వైసీపీతో మొదలైన పోరు వైసీపీ ప్రభుత్వానికీ, ఆ తర్వాత సీఎం జగన్ పైకి మళ్లించిన రఘురామరాజు.. టీడీపీ అనుకూల మీడియా సాయంతో నేరుగా హోరాహోరీ తలపడేదాకా వెళ్లారు. ఇదే క్రమంలో ఆయన అక్రమాస్తుల కేసులో సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి గతంలో లభించిన బెయిల్స్ ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. అక్కడ కౌంటర్లు, ఎన్ కౌంటర్లతో సాగిన పోరు ఓ దశలో ఉత్కంఠ రేపింది. జగన్ బెయిల్ రద్దవుతుందా అన్న చర్చకు తావిచ్చింది. కానీ అలాంటిదేదీ జరగలేదు. దీంతో వైసీపీ అధినేత కమ్ సీఎం జగన్ తో రఘురామ సాగిస్తున్న పోరుకు బ్రేక్ లభించింది. దీంతో వైసీపీ కూడా ఊపిరిపీల్చుకుంటోంది.

మసకబారిన రఘురామ ప్రభ ?
ఎప్పుడైతే జగన్, సాయిరెడ్డి బెయిళ్ల రద్గు విషయంలో కోర్టుల్ని ఆశ్రయించి రఘురామ ఎదురుదెబ్బలు తిన్నారో ఆ తర్వాత ఆయన ప్రభ మసకబారడం మొదలైంది. అప్పటివరకూ రఘురామ వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకుని ఆయన్ను టార్గెట్ చేస్తూ లోక్ సభ స్పీకర్ కు వరుసగా ఫిర్యాదులు చేసిన వైసీపీ.. కోర్టు తీర్పుల తర్వాత మాత్రం ఆయన్ను లైట్ తీసుకోవడం మొదలుపెట్టేసింది. రఘురామ ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఎన్ని పిటిషన్లు వేసినా న్యాయం తమవైపే ఉందని ధీమా వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలు ఇప్పుడు ఆయన పేరెత్తేందుకు సైతం ఇష్టపడటం లేదు. అయినా రఘురామ మాత్రం ఇవాళ్టికీ నిత్యం ప్రెస్ మీట్లు పెడుతూ వైసీపీనీ, వైసీపీ సర్కార్ ను, సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. మొదట్లో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇచ్చిన టీడీపీ అనుకూల మీడియా ఇప్పుడు లైట్ తీసుకోవడం మొదలుపెట్టేసింది. దీంతో రఘురామ కూడా తాను లేవనెత్తే అంశాల్లో సీరియస్ నెస్ ను కూడా తగ్గించేశారన్న ప్రచారం జరుగుతోంది.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications