ఏడాది తర్వాత అసెంబ్లీలో రోజా, సింహం సింగిల్ గానే వస్తుందంటూ కామెంట్
నిషేధానికి గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా ఏడాది తరువాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.
అమరావతి: నిషేధానికి గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా ఏడాది తరువాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అనంతరం ఆమె మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా గెలిచిందని అన్నారు.
సింహం సింగిల్ గానే వస్తుందని, ప్రజా క్షేత్రంలో గెలిచి తీరుతామని ఆమె వ్యాఖ్యానించారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు శిక్ష పడకపోవడం వల్లే ఆయన మళ్లీ ఎపీలో కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకున్నారన్నారు. రూ.300 కోట్లు ఖర్చుపెట్టి ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించింది సీఎం చంద్రబాబే అని దుయ్యబట్టారు.
కర్నూలులో శిల్పా చక్రపాణి గతంలో 147 ఓట్లతో గెలిచారని, ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారిన తరువాత మెజారిటీ 57కు తగ్గిందని.. మరి టీడీపీ గెలిచినట్లా? ఓడినట్లా? అని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి న టీడీపీ ఎమ్మెల్యేలు సిగ్గులేకుండా సంబరాలు చేసుకుంటున్నారని, నిజంగా ప్రజాబలం ఉంటే కొనుగోలు చేసిన 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా? అని ప్రశ్నించారు.
మంత్రి గంటా శ్రీనివాసరావు పాలన గాలికి ఒదిలేసి ఓట్లు కొనుక్కోవడంలో బిజీగా ఉన్నారని, ఆయన సొంత జిల్లాలో డిగ్రీ పేపర్ లీకైందని, ఇన్ చార్జిగా ఉన్న జిల్లాలో పదో తరగతి పేపర్లు లీకయ్యాయని, ఇక మరో మంత్రి నారాయణ కాలేజీలో పదో తరగతి తెలుగు, హిందీ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని ఎద్దేవా చేశారు.
ప్రజా సమస్యలు గాలికొదిలేసి కోట్లు ఖర్చెపెట్టి ఓట్లు కొనుక్కోవడం సిగ్గుచేటని, చంద్రబాబు నాయుడికి అంత ధైర్యం ఉంటే.. లోకేశ్ ను పోటీలో ఎందుకు నిలబెట్టలేదని ప్రశ్నించారు. సొంత నియోజక వర్గంలోనే ఓడిపోయిన చరిత్ర చంద్రబాబుకు ఉందని ఆమె పేర్కొన్నారు.
అయినా టీడీపీ ఎమ్మెల్యేలు ఏ మొహం పెట్టుకుని అసెంబ్లీకి వచ్చారు? గతంలో ఉప ఎన్నికల్లో టీడీపీ 18 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఆ చరిత్ర మరిచిపోతే ఎలా? ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను కొనేసి గెలవడం గెలుపుకాదు అని రోజా వ్యాఖ్యానించారు.