ఎమ్మెల్యే ఆర్థర్ vs బైరెడ్డి : నందికొట్కూరు వైసీపీలో మళ్లీ రచ్చ... మంత్రుల సమక్షంలోనే బాహాబాహీ...
కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. మంత్రుల సమక్షంలోనే ఎమ్మెల్యే ఆర్థర్,నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి బైరెడ్డి సిద్దార్థ రెడ్డి గొడవకు దిగారు. ఒక దశలో బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఎమ్మెల్యే ఆర్థర్పై కుర్చీ విసరబోయారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మంత్రులు ఇరువురిని నిలువరించడంతో గొడవ సద్దుమణిగినట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మంత్రుల సమక్షంలోనే కొట్టుకునే దాకా...
కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ,బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,అనిల్ కుమార్ యాదవ్,గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై మంత్రులు చర్చిస్తున్న సమయంలో నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్,స్థానిక వైసీపీ ఇన్చార్జి బైరెడ్డి సిద్దార్థరెడ్డి వర్గీయులు బాహాబాహీకి దిగారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇరువురి మధ్య నెలకొన్న విభేదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మంత్రుల సమక్షంలోనే ఇరు వర్గాలు కొట్టుకునేదాకా వెళ్లడంతో వైసీపీలో దీనిపై హాట్ హాట్ చర్చ జరుగుతోంది.
మంత్రుల జోక్యంతో సద్దుమణిగిన గొడవ
ఒక దశలో బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఎమ్మెల్యే ఆర్థర్పై కుర్చీ విసరబోయారన్న ప్రచారం జరుగుతోంది. వెంటనే మంత్రులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగినట్లు తెలుస్తోంది. నిజానికి నందికొట్కూరులో ఈ ఇరువురి మధ్య చాలాకాలంగా విభేదాలు నెలకొన్నాయి. ఎమ్మెల్యే అయినప్పటికీ నియోజకవర్గంలో తన మాట చెల్లుబాటు కావడం లేదని.. ప్రతీ విషయంలో బైరెడ్డి తనపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారని ఎమ్మెల్యే ఆర్థర్ తీవ్ర అసహనంలో ఉన్నారు. గతేడాది స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు జరుగుతున్న సమయంలోనే వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాను సూచించిన అభ్యర్థులకు అవకాశం ఇవ్వట్లేదని... బైరెడ్డితో ఆధిపత్య పోరు ఇక తనవల్ల కాదని ఏకంగా ఎమ్మెల్యే ఆర్థర్ అప్పట్లో రాజీనామాకు కూడా సిద్దపడ్డారు. పార్టీ పెద్దలు నచ్చజెప్పడంతో ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గారు.
తొలి నుంచి విభేదాలే...
తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే మరోసారి వీరిద్దరి మధ్య విభేదాలు బయటపడటం గమనార్హం. తొలి నుంచి ఆర్థర్,బైరెడ్డి గ్రూపుల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు ఇలా రచ్చకెక్కుతూనే ఉన్నాయి. గతంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ఎంపిక విషయంలోనూ రెండు గ్రూపుల మధ్య తీవ్ర వివాదం రాజుకుంది. , వైసీపీ జెండా మోసిన నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని ,మధ్యలో వచ్చినవారికే ప్రాధాన్యత దక్కుతోందని గతంలో బైరెడ్డి బహిరంగంగానే కామెంట్స్ చేశారు.జిల్లాలో పెద్ద నాయకులం అనుకునేవారు పద్ధతి మార్చుకోవాలని, తమ నియోజకవర్గంలో వేలు పెడతామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బైరెడ్డి దూకుడుకు ఎలా బ్రేక్ వేయాలో తెలియక ఎమ్మెల్యే ఆర్థర్ సతమతమవుతున్నారు. ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడంతో నియోజకవర్గ వైసీపీలో కోల్డ్ వార్కు ఇప్పట్లో తెరపడే సూచనలు కనిపించట్లేదు.