బాబు, పవన్ మీడియా ముందుకు రావాలి.. వెనకుండి రెచ్చగొట్టడం కాదు: పిల్లి సుభాష్ చంద్రబోస్
కోనసీమ రణరంగంగా మారుతోంది. జిల్లా పేరుపై ఆందోళనకారులు హింసాత్మక చర్యలకు దిగారు. దీంతో పచ్చని కోనసీమలో ఒక్కసారిగా అలజడి నెలకొంది. దీనిపై నేతలు స్పందిస్తున్నారు. సంయమనం పాటించాలని కోరుతున్నారు. ప్రజల విజ్ఞప్తి మేరకే కోనసీమకు డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టారని ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంఘవిద్రోహ శక్తులు అశాంతిని రేకేత్తించాయని మండిపడ్డారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా అంబేడ్కర్ జిల్లా పేరు పెడతా అని చెప్పారు. చంద్రబాబు, పవన్కల్యాణ్ మీడియా ముందుకు రావాలి.. వెనక ఉండి రెచ్చగొట్టడం మానుకోవాలని కోరారు. బయట ఒక మాట లోపల ఒక మాట చెప్పకూడదని సూచించారు. పచ్చని కోనసీమలో విధ్వంసాలు సృష్టించొద్దని పేర్కొన్నారు. అంబేడ్కర్ పేరు పెట్టుకోవడం మన అదృష్టం. ఉద్యమకారులు సంయమనం పాటించాలని కోరారు. అంబేడ్కర్ వల్ల దేశంలో ప్రజాస్వామ్యం వర్దిల్లుతోంది. మనతో పాటు స్వాతంత్ర్యం వచ్చిన పాకిస్తాన్లో రాజ్యాంగం ఫెయిల్ అయిందని ఎంపీ సుభాష్ చంద్రబోస్ అన్నారు.
ఒక్కసారిగా కోనసీమ అట్టుడికింది. జిల్లాకు భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని కొందరు వ్యతిరేకించారు. మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటికి నిప్పుపెట్టారు. దీంతో అమలాపురంలో హై టెన్షన్ నెలకొంది. మహానేత పేరు పెడితే పునరాలోచించాల్సిన అవసరం ఏముందని అడిగారు. అంతటి నాయకుడు పేరును పెట్టడం అందరూ ఓన్ చేసుకోవాలి. ముందు అందరూ సంయమనం పాటించాలి.. అన్ని వర్గాలతో చర్చలు జరుపుతామని తెలిపారు. ఆ పేరు పెట్టడంపై అన్ని వర్గాల ఆమోదం ఉంది కాబట్టి పరిష్కరించలేని సమస్య అయితే కాదని మంత్రులు, నేతలు అంటున్నారు. విపక్షాలు మాత్రం వైసీపీ సర్కార్ తీరును తప్పుపడుతున్నారు.