పవన్ కళ్యాణ్ ప్రమాణం చేసి వెళ్లాలి, ప్రకాశ్ రాజ్లా: బాధితురాలు
అగ్రిగోల్డ్ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలుచుకుంటే న్యాయం జరుగుతుందని, ఆయన ప్రభుత్వం మెడలు వంచుతారని తాము నమ్ముతున్నామని, అలా అని ప్రమాణం చేసి వెళ్లాలని ఓ బాధితురాలు అన్నారు.
విజయవాడ: అగ్రిగోల్డ్ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలుచుకుంటే న్యాయం జరుగుతుందని, ఆయన ప్రభుత్వం మెడలు వంచుతారని తాము నమ్ముతున్నామని, అలా అని ప్రమాణం చేసి వెళ్లాలని ఓ బాధితురాలు అన్నారు.
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అగ్రిగోల్డ్ బాధితులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడారు. అగ్రిగోల్డ్ తమకు నమ్మక ద్రోహం చేసిందని బాధితులు చెప్పారు. కంపెనీ చేసిన పాపానికి తమకు నరకం కనిపించిందన్నారు.
తమిళనాడులో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఢిల్లీ వీధుల్లో నిరసన తెలిపి, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మాట్లాడి వచ్చారని చెప్పారు.

2014లో బీజేపీకి ఓట్లు వేయాలని చెప్పిన పవన్ కళ్యాణ్, ఈనాడు అగ్రిగోల్డ్ తరఫున ప్రశ్నించేందుకు అన్ని అర్హతలు కలిగి ఉన్నారని చెప్పారు. ప్రకాశ్ రాజ్ చేసినట్లు, ఢిల్లీకి వెళ్లి బాధితులకు సత్వర న్యాయం జరిపించేందుకు పవన్ మాట్లాడాలన్నారు.
తక్షణం ప్రభుత్వ ఖజానా నుంచి చిన్న మొత్తాలను దాచుకున్న వారికి డబ్బులు ఇప్పించాలని, ఆపై ఆస్తులను వేలం వేయించి పెద్ద ఖాతాదారులకు పంచాలని ఆమె డిమాండ్ చేశారు.
మరో బాధిత మహిళ మాట్లాడుతూ... గత ఇరవై ఏళ్లుగా అగ్రీగోల్డ్ ను పెంచి పోషించిన వాళ్లలో ప్రభుత్వాలు కూడా ఉన్నాయని, ఎందరో నేతల వరకూ ఆగ్రీగోల్డ్ కార్యక్రమాల్లో అతిథులుగా హాజరైనందునే, ప్రజలు ఆ సంస్థను గుడ్డిగా నమ్మారన్నారు.
2014లో కేసు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆగ్రీగోల్డ్ డైరెక్టర్లలో ఒకరికి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అవార్డులిచ్చి సత్కరించారని ఆరోపించారు. పోలీసులు కూడా తమకు మద్దతివ్వడం లేదన్నారు. ప్రభుత్వం మెడలు వంచుతానని, సభాముఖంగా ప్రమాణం చేసి వెళ్లాలని ఆమె కోరారు.












Click it and Unblock the Notifications