'వ్యవసాయానికే పెద్దపీట, ఇంకో 5 నుంచి 10 ఏళ్లలో కష్టాలు తీరతాయి'
అమరావతి: ఏపీలో వ్యవసాయ రంగంపై ఆధారపడి 65 శాతం మంది ప్రజలు జీవిస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు లోని లాంఫాంలో వ్యవసాయ యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాంఫాంలో వ్యవసాయ వర్శిటీకి 500 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు.
యూనివర్సిటీకి రూ.1500 కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు, కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు ఆయన చెప్పారు. వ్యవసాయంలో పెనుమార్పులు వస్తున్నాయని వాటికి అనుగుణంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు.
ఏపీలో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన చెప్పారు. 4 లక్షల భూసార పరీక్షలు చేశామని, వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. వ్యవసాయ పరికరాలపై సబ్సిడీ పెంచామని, పొగాకు, శనగకు మద్దతు ధర కల్పిస్తున్నామని ఆయన చెప్పారు.
వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. నీటి వనరులను ఉపయోగించుకుని ఆక్వా కల్చర్ను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.
కందిపప్పు ధర భారీగా పెరిగినా రేషన్ దుకాణాల ద్వారా రూ. 50కే సరఫరా చేసినట్లు చెప్పారు. రైతులకు రుణ విముక్తి కింద రూ. 24 వేల కోట్లు ఇచ్చామన్నారు. త్వరలో వ్యవసాయానికి పగటిపూటే కరెంట్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
రాజధాని అమరావతి నిర్మాణం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా 33 వేల ఎకరాలు రైతలు స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు. కొత్త రాష్ట్రంలో ఇంకా కష్టాలు తీరలేదని, రాష్ట్రాభివృద్ధిలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఇంకా 5 నుంచి 10 సంవత్సరాలు కష్టపడితే కష్టాలన్నీ తీరిపోతాయన్నారు.