అహోబిలం ఆలయం మూసివేత: అర్చకుడి కాంటాక్టులపై ఆరా: ఎప్పుడు తెరుస్తారనేది..
కర్నూలు: నవ నారసింహులు కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అహోబిలం ఆలయం మూత పడింది. ఇక ఎప్పుడు తెరుస్తారనేది ఇంకా తెలియరాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున లక్ష్మీనరసింహ స్వామి భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. ఇప్పుడిప్పుడే భక్తుల రద్దీ నెలకొంటోంది. అదే సమయంలో ఆలయం మూతపడటం చర్చనీయాంశమైంది.
ఆలయ అర్చకుడికి కరోనా వైరస్ సోకడమే దీనికి కారణం. రెండు రోజులుగా దగ్గు, జ్వరంతో బాధపడుతోన్న అర్చకుడికి వైద్య పరీక్షలను నిర్వహించగా.. కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీనితో ఆయనను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డుకు తరలించారు. చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు శ్రీ అహోబిలం మఠ పరంపరాధీన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం మేనేజర్ వైకుంఠం వెల్లడించారు.
ఆలయాన్ని మూసివేశామని, శుద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. 37 సంవత్సరాల వయస్సు ఉన్న అర్చకుడొకరికి కరోనా వైరస్ సోకినట్లు ఆయన నిర్ధారించారు. దీనితో అహోబిలం మఠం 46వ జీయరు వారి ఆదేశాల మేరకు ఆలయాన్ని మూసివేశామని తెలిపారు. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి చెందిన అనంతరం అమల్లోకి తీసుకొచ్చిన లాక్డౌన్ వల్ల సుమారు మూడున్నర నెలల పాటు ఆలయాన్ని మూసివేశారు.
లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా కొద్దిరోజుల కిందటే ఆలయంలో భక్తుల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. దీనితో కర్నూలు జిల్లా నుంచి భక్తులు లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడానికి వచ్చారు. ఇప్పటికే కర్నూలు జిల్లాలో వందలాది కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ పరిస్థితుల మధ్య ఆలయానికి వచ్చిన భక్తుల నుంచి అర్చకుడికి కరోనా వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తుల వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ఆలయానికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడి వ్యక్తిగత వివరాలను నమోదు చేయడాన్ని రాష్టంలోని అన్ని ఆలయాల్లో కూడా తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. భక్తుల ఫోన్ నంబర్, ఇంటి చిరునామా, ఆధార్ కార్డు నంబర్ వంటి వివరాలను నమోదు చేస్తున్నారు. దీని ఆధారంగా అర్చకుడి కాంటాక్టులను అధికారులు ఆరా తీస్తున్నారని తెలుస్తోంది.