ప్రమాదకరంగా ఏపీలో అవినీతి, ‘మేకప్’ వారితో జాగ్రత్త: అజయ్ కల్లం సంచలనం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పని తీరును మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తీవ్రంగా తప్పు బట్టారు. రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని, రాజధాని నిర్మాణం పేరుతో భారీ ఎత్తున డబ్బులు వృధా చేస్తున్నారని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం ఆరోపించారు.
ఇప్పటికే మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరో మాజీ అధికారి విమర్శలు ఎక్కుపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజధాని పేరుతో దుబారా
శుక్రవారం అజయ్ కల్లం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో అవినీతికి సంబంధించి తానో పుస్తకం రాసినట్లు తెలిపారు. రాజధాని పేరుతో దుబారా చేస్తున్నారని, మహానగరాల నిర్మాణం అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లుగా ఉందని ఆయన ఆరోపించారు.
పెద్ద నగరాలు కట్టడం కాదు
అన్ని ఒకే చోట కేంద్రీకృతం చేయడం సరికాదని అజయ్ కల్లం అన్నారు. విజయవాడతో పాటు కర్నూలు, విశాఖపట్నంలకు పాలనను విస్తరించాలని ఆయన సూచించారు. అనుబవజ్ఞుల పాలన అంటే పెద్ద నగరాలు కట్టడమే కాదని, గ్రామాలను అభివృద్ధి చేయడం కూడా అని అజయ్ వ్యాఖ్యానించారు.
వ్యవస్థలకు ప్రమాదం
కొత్త రాష్ట్రంలో ప్రజలకు మంచి జరగకపోగా, పాలకుల అవినీతి చాలా పెరిగిపోయిందని, దీని వల్ల వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదముందని హెచ్చరించారు. నిజానికి ఏపీలో కొత్త రాజధాని కట్టాలనుకునేది కేవలం పైరవీల కోసమే మాత్రమేనని అన్నారు.
మేకప్ వేసుకునేవారితో జాగ్రత్త
కొందరు మేకప్లు వేసుకుని రాజకీయాలు చేస్తున్నారని, వారిపట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అజయ్ కల్లం హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను ఉద్దేశించినట్లు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత యువతరంలో ప్రశ్నించే తత్వం లోపించడం బాధాకరమని అజయ్ కల్లం ఆవేదన వ్యక్తం చేశారు.