నో డౌట్స్: నిజాం డెవలప్పై అక్బర్ గడగడ, జగన్ సహా
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ సమయంలో శాసన సభలో మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సోమవారం నిజాం రాజు చేసిన అభివృద్ధిపై గడగడా చదువుకుంటూ పోయారు. ఇప్పుడు మనం కూర్చున్న అసెంబ్లీ కూడా నిజాం కట్టిందేనని వ్యాఖ్యానించారు. నిజాం పేరు చెప్పి తెలంగాణను అడ్డుకుంటారా, నిజాంకు, రాష్ట్ర విభజనకు ఏం సంబంధమని, తెలంగాణను ఎవరు ఆపలేరని అక్బరుద్దీన్ అన్నారు.
నిజాం చేసిన అభివృద్ధిపై సభలో గడగడా చదివారు. హైదరాబాదును, తెలంగాణను నిజాం ఎంతో అభివృద్ధి చేశారన్నారు. 1854లోనే నిజాం విద్యా సంస్థలను నెలకొల్పారన్నారు. తెలంగాణవ్యాప్తంగా పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగాలు కల్పించారన్నారు. ఆంధ్రప్రదేశ్ విలీనం ముందే సర్ ప్లస్ స్టేట్ ఇచ్చారన్నారు. నిజాం కాలంలో హైదరాబాద్ ఇండస్ట్రియల్ హబ్గా మారిందన్నారు. సీమాంధ్ర నుండి వచ్చిన ఎందరో నేతలు హైదరాబాదులో చదువుకున్నారన్నారు.
వైయస్ జగన్, అశోక గజపతి రాజు, పల్లం రాజు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వంటి నేతలు హైదరాబాదు స్థాపించిన విద్యాలయాల్లోనే చదివారన్నారు. తెలంగాణలో అనేక పరిశ్రమలు స్థాపించిన ఘనత నిజాందే అన్నారు. హైదరాబాదును ఎవరు అభివృద్ధి చేయలేదని, నిజామే అభివృద్ధి చేశారన్నారు. హైదరాబాదులో ఐదు భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారన్నారు. నిజాంను విమర్శించినంత మాత్రాన రాష్ట్రం సమైక్యంగా ఉంటుందా అన్నారు.
హైదరాబాదు అందమైన నగరం కాబట్టే సీమాంధ్రులు వచ్చారన్నారు. నిజాం ఇచ్చిన స్కాలర్షిప్తోనే సరోజిని నాయుడు లండన్లో చదువుకున్నారన్నారు. మనం కూర్చున్న అసెంబ్లీని నిజాం కట్టారని, హైదరాబాదులో సిమెంట్ రోడ్డు నిర్మించారని చెప్పారు. హుస్సేన్ సాగర్లో మొదటి థర్మల్ పవర్ ప్లాంట్ కట్టారన్నారు. బేగంపేట విమానాశ్రయం నిజాం కట్టిందేనని, నీటి వనరుల సంరక్షణ కోసం పాటుపడ్డారని, రైతుల కోసం చెరువులు తవ్వించారని చెప్పారు.
1919లో హైకోర్టు, 1930లో విద్యుదుత్పత్తి నిజాం కాలంలో జరిగిందన్నారు. 1940లో ఎన్నో పత్రికలు ఉన్నాయని చెప్పారు. యాదగిరిగుట్ట, భద్రాచలం, బాలాజి తిరుపతి గుడికి నిజాం రాజులు విరాళాలు ఇచ్చారన్నారు. 1886 నుండే పలు తెలుగు పత్రికలు ఉన్నాయని చెప్పారు. నిజాం ప్రభువును పొగిడేందుకు తాను గర్వపడుతున్నానని చెప్పారు. నిజాం కాలంలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందనడంలో ఎలాంటి అనుమానం లేదన్నారు.
రాయలసీమ, ఆంధ్రా అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. తానొకటి చెబితే టిడిపి నేతలు మరొకటి మాట్లాడుతున్నారని ఓ సందర్భంలో అన్నారు. చంద్రబాబుకు ఓ స్టాండ్ అంటూ లేదని, బాబుచేసిన అభివృద్ధి బ్యాలెట్ రూపంలో తేలిపోయిందన్నారు. అధికారంలో ఉండి కూడా రాయలసీమ నేతలు వారి ప్రాంతాలను అభివృద్ధి చేసుకోలేదన్నారు.