మోడి మెచ్చుకోలు: ఈటెల, ఒప్పుకోం: ఏపీవారిపై అక్బర్
హైదరాబాద్: సమగ్ర సర్వేను ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకున్నారని, విపక్షాలకు ప్రభుత్వం మంచి చేస్తే ప్రశంసించే మంచి మనసు లేదని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో అన్నారు. అర్హులను గుర్తించేందుకే తాము సర్వేను చేశామన్నారు. సర్వేను తెల్ల కార్డుల కోసం చేయలేదని వివరణ ఇచ్చారు. ప్రపంచం నివ్వెలపోయేలా సర్వే నిర్వహించామన్నారు.
రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య కంటే రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నాయన్నారు. రేపటి తెలంగాణ కోసం భవిష్యత్తు ప్రణాళికను నిర్దేశించుకుంటుందుకు సర్వే చేశామని చెప్పారు. చాలామందిగి నగరంలోను, సొంత గ్రామంలోను ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు ఉన్నాయని, వాటన్నింటిని సరిచేయాలనే ఉద్దేశ్యంతో చేశామన్నారు. సర్వే తెల్లరేషన్ కార్డులు, పింఛన్ల కోసం కాదన్నారు. ఆర్థిక, సామాజిక, విద్య, వైద్య స్థితిగతులను తెలుసుకునేందుకు చేశామన్నారు. ప్రజలకు మరింత సేవ చేసేందుకే అన్నారు.
మేం ఒప్పుకోం: అక్బరుద్దీన్
సర్వే ఆధారంగా ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల నుండి వచ్చిన వారికి పథకాలు నిరాకరిస్తే మజ్లిస్ పార్టీ వ్యతిరేకిస్తుందని ఆ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. సర్వే వివరాలు సభ ముందు పెట్టాలని కోరారు. అసలు సర్వే వివరాలు సభ ముందు పెట్టే ఉద్దేశ్యం ప్రభుత్వానికి ఉందా లేదా అని ప్రశ్నించారు. ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల నుండి వచ్చిన వారి పిల్లల భవిష్యత్తు ఇబ్బందుల్లో ఉందన్నారు.
అంతకుముందు జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. అల్ప సంఖ్యాక వర్గాలకు ఉపాధి అవకాశాల కల్పించి యువతను ఆదుకోవాలని సూచించారు. ఎస్సీ కార్పోరేషన్ ద్వారా లక్షలాది మంది దళితులు, గిరిజనులు, అల్ప సంఖ్యాక వర్గాలకు లబ్ధి చేకూర్చాలన్న కార్యక్రమం లక్ష్యమని, లక్ష్యాలను చేరుకోవడంలో బ్యాంకర్లు సహకరించాలన్నారు. దీనిపై ఈటెల స్పందిస్తూ.. బలహీన వర్గాలకు తెలంగాణ రాష్ట్రం నిలయమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు చేకూర్చాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
హైదరాబాదు నగరంలో ఇప్పటికీ సర్వే జరగకుండా ఉన్న చోట జీహెచ్ఎంసీ వారు సేకరిస్తున్నారని, ఇంకా మిగిలి ఉంటే వాటిని తీసుకుంటామని చెప్పారు. విపక్షాలు పదేపదే అడ్డుకోవడంపై మరో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తాము ఎంతసేపైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, సహకరించాలని కోరారు.