బీజేపీకి భారీ షాక్: పవన్ కళ్యాణ్ ఆహ్వానం, జనసేనలోకి ఎమ్మెల్యే ఆకుల, ఎంపీగా పోటీ ఛాన్స్
రాజమండ్రి: భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే భారీ షాక్ ఇచ్చారు. ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి, పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలో చేరుతారనే ప్రచారం గత కొద్ది రోజులుగా సాగుతోంది. ఇందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఇటీవల ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. అప్పుడే రాజీనామాలు, పార్టీ మార్పుపై వార్తలు వచ్చాయి.
దీనిపై ఆయన స్పందిస్తూ.. తాను ఇంకా రాజీనామా చేయలేదని, అమిత్ షాను కలిసిన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. ఆ తర్వాత ఆయన ఇప్పుడు పార్టీ మారాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఓ టీవీ ఛానల్తోను ఆయన మాట్లాడుతూ... బీజేపీకి గుడ్ బై చెప్పి, జనసేనలో చేరనున్నట్లు చెప్పారట.

బీజేపీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన బీజేపీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఆ తర్వాత జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. మరో పది రోజుల్లో జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 21వ తేదీన పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారని తెలుస్తోంది.

కేంద్రంపై విమర్శలు
సదరు టీవీ ఛానల్తో మాట్లాడుతూ... బీజేపీ పైన మండిపడ్డారు. విభజన నేపథ్యంలో ఏపీ పైన కేంద్రం వివక్ష చూపించిందని, రైల్వే జోన్, దుగరాజుపట్నం పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్ విషయాల్లో కేంద్రం అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు. ఏపీలో బీజేపీ బలోపేతానికి చేసిందేమీ లేదని విమర్శించారు.

పవన్ కళ్యాణ్ ఆహ్వానం, లోకసభకు పోటీ చేసే ఛాన్స్
2019 ఎన్నికలపై దృష్టి సారించిన పవన్ కళ్యాణ్, తనను జనసేనలోకి ఆహ్వానించారని ఆకుల సత్యనారాయణ చెబుతున్నారట. పవన్ పార్టీలో ఏ పదవి ఇచ్చినా సిద్ధమని, ఎలాంటి షరతులు లేకుండా జనసేనలో చేరుతున్నట్లు కూడా ప్రకటించారని తెలుస్తోంది. ప్రస్తుతం రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్న ఆకుల.. అవసరమైతే జనసేన నుంచి రాజమండ్రి లోకసభకు కూడా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.

గోదావరి లెక్క
కాగా, ఆకుల సత్యనారాయణ చేరిక వెనుక ఆయన లెక్కలు ఆయనకు ఉన్నాయని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన మధ్యనే హోరాహోరీ కనిపిస్తుందని భావిస్తున్నారు. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని, ఏపీలో పెద్దగా బలం లేనందున ఉపయోగం లేదని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. పైగా, ఉభయ గోదావరి జిల్లాల్లో వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఎక్కువ సీట్లు వస్తాయని రాజకీయ పండితులు లెక్కలు వేస్తున్నారు. ఇక్కడ పవన్ సామాజిక వర్గం ఎక్కువ. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన ఆకుల... అన్నింటిని బేరీజు వేసుకొని జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు.












Click it and Unblock the Notifications