ఏపీలో అయిదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం: అసెంబ్లీ ఎన్నికల బరిలో నారాయణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అయిదు శాసన మండలి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అయిదు స్థానాలకు అయిదు నామినేషన్లు దాఖలు అయ్యాయి. శుక్రవారం వాటిని పరిశీలించిన రిటర్నింగ్ అధికారులు.. వాటిని ఆమోదించారు. శాసన సభ్యుల కోటాలో ఈ అయిదు మందీ ఎన్నికయ్యారు. వారిలో నలుగురు అధికార తెలుగుదేశం పార్టీ తరఫున, ఒకరు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు.
ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ఏపీ ఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబు, బీటీ నాయుడు, దువ్వారపు రామారావు టీడీపీ నుంచి నామినేషన్లను దాఖలు చేశారు. వైఎస్ఆర్ సీపీ తరఫున జంగా కృష్ణమూర్తి నామినేషన్ వేశారు. గడువు ముగిసే సమయానికి అయిదు నామినేషన్లు దాఖలయ్యాయి. పోటీ అంటూ ఎవరూ లేకపోవడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు. త్వరలో వారికి అధికారికంగా ఎన్నిక పత్రాలను అందజేయనున్నారు.

యనమల రామకృష్ణుడితో పాటు మున్సిపల్ శాఖ మంత్రి పీ నారాయణ పదవీ కాల పరిమితి కూడా ముగిసింది. ఆయనకు మరోసారి ఛాన్స్ ఇవ్వలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వచ్చే ఎన్నికల్లో నారాయణను అసెంబ్లీ ఎన్నికల బరిలో దించే అవకాశం ఉంది. ఆయన సొంత జిల్లా నెల్లూరు నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications