తెలంగాణపై మరో అఖిల పక్ష సమావేశం: షిండే
న్యూఢిల్లీ/ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మరో అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ఈ సమావేశానికి 8 రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తారు. జివోఎం విధివిధానాలపై అభిప్రాయాలను వ్యక్తం చేసిన తర్వాత అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు షిండే చెప్పారు.
నవంబర్ 7వ తేదీలోపల గానీ తర్వాత గానీ అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. విధివిధానాలపై అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతూ హోం శాఖ 8 రాజకీయ పార్టీలకు లేఖలు రాస్తారు. ఐదో తేదీలోగా రాజకీయ పార్టీలు జివోఎం విధివిధానాలపై రాజకీయ పార్టీలు అభిప్రాయాలు చెప్పాల్సి ఉంటుంది.
తెలంగాణపై బుధవారంనాడు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన కోర్ కమిటీ సమావేశం జరిగింది. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు పి. చిదంబరం, సుశీల్ కుమార్ షిండే, ఎకె ఆంటోనీ, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ పాల్గొన్నారు.
కోర్ కమిటీ సమావేశానికి ముందు సుశీల్ కుమార్ షిండే బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. తెలంగాణపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సిపిఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి కె. నారాయణ బుధవారం షిండేను కలిసి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.
కాగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐఎఎస్, ఐపియస్ అధికారుల విభజనకు సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కేంద్రానికి అందించింది. ఏ ప్రాంతానికి ఎంత మంది వెళ్లాలనే వివరాలను ఈ నివేదికలో పొందుపరిచారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి బుదవారం కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి వి. నారాయణస్వామిని కలిసి ఆ నివేదికను అందించారు.
ఇదిలావుంటే, విజయ కుమార్ నేతృత్వంలోని టాస్క్ఫోర్స్ బుధవారం హైదరాబాదులో సమావేశమైంది. ఈ సమావేశంలో డిజిపి ప్రసాదరావు పాల్గొన్నారు. విభజన నేపథ్యంలో శాంతిభద్రతలపై టాస్క్ఫోర్స్ అధ్యయనం చేస్తున్న విషయం తెలిసిందే.