రేపటి నుంచి ఏపీ సచివాలయ పరీక్షలు- :నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
విజయవాడ: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోవిడ్ ఉన్నప్పటికీ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ముందుకొచ్చింది. అభ్యర్ధులు, ఇన్విజిలేటర్లలో పలు భయాలు ఉన్నప్పటికీ పరీక్షలకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నా అభ్యర్ధుల్లో భయాలు మాత్రం తొలగిపోలేదు.
రేపటి నుంచి జరిగే గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల్లో దాదాపు 10 లక్షల మంది అభ్యర్ధులు హాజరవుతున్నారు. 16,802 సచివాలయ పోస్టుల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్కుమార్ తెలిపారు. 2 వేల పరీక్షా కేంద్రాల్లో పరీక్షల కోసం ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. పరీక్షా కేంద్రంలో ఒక్కో గదిలో కేవలం 16 మందినే అనుమతిస్తామన్నారు.
ఈసారి గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు కోవిడ్ నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ ఉన్నవారి కోసం ప్రత్యేక ఐసోలేషన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తన్నారు. అభ్యర్థుల కోసం విశాఖ, విజయవాడలో సిటీ బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు. ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లు ఇస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికారులు తెలిపారు. పరీక్షకు వచ్చేవారికి స్క్రీనింగ్, శానిటేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్కుమార్ వివరించారు..