లోకేష్ ఏం చేయబోతున్నారు - గెలుపు పై ఆర్కే ధీమా : రేపే ఎన్నిక..!!
రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ పెంచిన ఎన్నిక. ఒక ఎంపీపీ పదవి కోసం రాజకీయంగా ఉత్కంఠకు కారణమైన దుగ్గిరాలలో రేపు ఎన్నిక జరగనుంది. టీడీపీ ముఖ్యనేత లోకేష్ బాధ్యత తీసుకున్న మంగళగిరి నియోజక వర్గ పరిధిలోని మండలం..అందునా.. ఆర్కే తో సై అంటే సై అంటున్న సమయంలో జరుగుతున్న ఎన్నిక కావటంతో మరింత ఆసక్తి పెంచుతోంది. దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికపై అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు (గురువారం) ఉదయం కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ ఎన్నిక నిర్వహించనున్నారు.
రిజర్వేషన్ ప్రకారం బీసీ అభ్యర్థికి ఎంపీపీ సీటు కేటాయించారు. దుగ్గిరాల మండలంలోని 18 ఎంపీటీసీ స్థానాల్లో తెదేపా 9, వైకాపా 8, జనసేన 1 స్థానాలు గెలుపొందాయి. జనసేన ఎంపీటీసీ అభ్యర్థి ఇప్పటికే తెదేపాకు మద్దతు ప్రకటించారు. అత్యధిక స్థానాలు గెలిచిన తెదేపాకు ఎంపీపీ పీఠం దక్కే అవకాశముండటంతో చిలువూరు నుంచి గెలిచిన జబీన్ను ఎంపీపీ అభ్యర్థిగా తెదేపా ప్రకటించింది. అయితే, గతంలోనే ఈ ఎన్నిక జరగాల్సిన సమయంలో జబీన్కు కులధ్రువీకరణ పత్రం అదఇకారుల నుంచి అందలేదు.
అదే సమయంలో అప్పటి జిల్లా కలెక్టర్ జబీన్ బీసీ కాదంటూ నివేదిక ఇచ్చారు. జబీన్ పదో తరగతి సర్టిఫికెట్, ఓటర్ లిస్టు, ఆమె ఎంపీటీసీగా నామినేషన్ వేసిన పత్రాలు కూడా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. అయితే, సంఖ్యా పరంగా అత్యధిక స్థానాల్లో తమ పార్టీ అభ్యర్ధి ఉన్నా టీడీపీ నుంచి వారిలో బీసీ అభ్యర్ధి లేకపోవటంతో..ఇప్పుడు ఎంపీపీ పదవి ఎన్నిక సమయంలో ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారింది. మరో వైపు తాము ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎంపీపీ స్థానాన్ని గెలుచుకోపోబోతున్నామని మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు.
గతంలో ఇదే ఎన్నికకు సంబంధించి చోటు చేసుకున్న వివాదం నేపథ్యంలో దాదాపు 300 మంది పోలీసులను రంగంలోకి దించారు. జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొంత కాలంగా మంగళగిరి నియోజకవర్గం మొత్తంలో లోకేష్ రోజుకో గ్రామంలో పర్యటిస్తున్నారు. మంగళగిరిలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేస్తానని..అన్నింటికీ సమాధానం చెబుతామని లోకేష్ చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది.