'సుప్రీం నోటిసులు వచ్చాయంటే.. ఇక చంద్రబాబు సంగతి అంతే!'
ఓటుకు నోటు కేసులో సుప్రీం నుంచి నోటీసులు జారీ అయ్యాయంటే చంద్రబాబుకు ఇక చుక్కెదురైనట్లేనని ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.
అమరావతి: ఓటుకు నోటు కేసును సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించిన నేపథ్యంలో.. పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కొత్త అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర గురించి అందరికీ తెలుసని, కేసుకు భయపడే రాష్ట్రానికి అనేక రకాలుగా ఆయన నష్టాలు చేకూర్చారని అన్నారు.
ఓటుకు నోటు కేసులో సుప్రీం నుంచి నోటీసులు జారీ అయ్యాయంటే చంద్రబాబుకు ఇక చుక్కెదురైనట్లేనని ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు ఏపీలో దోచుకున్న అక్రమ సంపాదనతో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయబోయారని ఆరోపించారు.
ఆడియో టేపుల్లో దొరికిపోయింది చంద్రబాబేనని, 'మనవాళ్లు బ్రీఫుడు మీ' అన్న గొంతు ఆయనదే అని ప్రతీ ఒక్కరికి తెలుసని చెప్పారు. తెలంగాణ ఏసీబీ, చంద్రబాబు సర్కార్ ఇద్దరూ కలిసి ఢిల్లీ పెద్దల కాళ్లు, గడ్డాలు పట్టుకుని తప్పించుకోజూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పునర్విభజన చట్టం సెక్షన్-8 ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్ల పాటు హైదరాబాద్ మీద హక్కులున్నా.. చంద్రబాబు హైదరాబాద్ ను అప్పుడే వదులుకున్నారని అన్నారు.
తెలంగాణ సర్కార్ అక్రమంగా గోదావరి, కృష్ణా నదులపై ఆనకట్టలు కడుతుంటే చంద్రబాబు పల్లెత్తు మాట అనలేదని గుర్తుచేశారు. ఏపీకి న్యాయంగా దక్కాల్సిన ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టుపెట్టేశారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసుపై ఎంతదాకా పోరాడాతమని ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు.
దివంగత వైఎస్ స్ఫూర్తితో, పార్టీ అధ్యక్షుడు జగన్ అండదండలతో పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. కేసు విషయంలో తెలంగాణ మెజిస్ట్రేట్ తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్బంగా ఆయన గుర్తుచేశారు. ఏదేమైనా చంద్రబాబుకు సుప్రీం నుంచి నోటీసులు జారీ అవడం శుభపరిణామం అని అన్నారు.