వైఎస్ జగన్ అడ్డాలో ఇసుక దందా,జిల్లా ఎస్పీ సీరియస్, నేరుగా నదిలోకి వెళ్లి?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఆ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సీరియస్ అయ్యారు. అక్రమంగా ఇసుక ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా మీరేం చేస్తున్నారు అంటూ ఆయా పోలీస్ స్టేషన్ల సిబ్బందిని కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నిలదీశారు. స్వయంగా జిల్లా ఎస్పీ రంగంలోకి దిగడంతో కడప జిల్లా పోలీసులు ఉలిక్కిపడ్డారు.
కడప జిల్లాలోని వేంపల్లిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేసి ఆ ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు కొందరు సమాచారం ఇచ్చారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని కడప జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు ఆయా పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వేంపల్లిలోనే కుమ్మ రాంపల్లి, గవి మల్లేశ్వర స్వామి ఆలయం పరిసర ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక తవ్వి తరలిస్తున్నారని కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు కొందరు ఫిర్యాదు చేశారు.

గవి మల్లేశ్వర స్వామి ఆలయం సమీపం నుండి పాపాఘ్ని నది సమీపంలోకి ట్రాక్టర్లతో వెళ్లి ఇసుకను తవ్వేస్తున్నారని, రాత్రిపూట ఆ ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని స్థానికులు కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న కడప జిల్లా ఎస్పీ వేంపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ తిరుపాల్ నాయక్ ఫోన్ చేసి వివరాలు అడిగారని తెలిసింది. ఒక్కసారిగా జిల్లా ఎస్పీ ఫోన్ చేయడంతో హడలిపోయిన వేంపల్లి ఎస్ఐ తిరుపాల్ నాయక్ వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి పాపాఘ్ని నదిలోకి ట్రాక్టర్లు వెళ్లకుండా జేసీబీలతో పెద్ద పెద్ద గోతులతో తవ్వించారు.
అర్ధరాత్రి నుండి ఉదయం వరకు లెక్కలేనన్ని ట్రాక్టర్లు తీసుకువచ్చి పాపాఘ్ని నది పరిసర ప్రాంతాల్లో ఇసుక తవ్వేసి ఇష్టం వచ్చినట్లు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న వారిని వదిలేస్తున్నారని స్థానికుల ఆరోపించారు. గతంలో ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదని, ఇసుక వ్యాపారం చేస్తున్నవారు వైసీపీ మద్దతు దారులని స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు ఆరోపించారు.
పాపాఘ్ని నది పరిసర ప్రాంతాల్లోని ఇసుకకు భారీ డిమాండ్ ఉండడంతో ఆ వ్యాపారం చేయడానికి కొన్ని నెలల క్రితం సుమారు 25 మంది కొత్తగా ట్రాక్టర్లు కొనుగోలు చేసి అర్ధరాత్రి నుండి మరుసటి రోజు ఉదయం వరకు స్వచ్చగా ఇసుకను అక్కడినుండి అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. జిల్లా ఎస్పీ దెబ్బకు హడలిపోయిన పోలీసులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఓ ట్రాక్టర్ ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఒక ట్రాక్టర్ పట్టుకుంటే సరిపోదని, అన్ని ట్రాక్టర్లను ఎలా పట్టుకోవాలని, అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications