చంద్రబాబు వైపే: పవన్ కల్యాణ్తో పొత్తుతో జగన్ చిత్తే?
జనసేన అధినేత పవన్ కల్యాణ్తో పొత్తు పెట్టుకుంటేనే విజయావకాశాలు మెరుగవుతాయని వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు సూచించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.
విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్తో పొత్తు పెట్టుకుంటేనే విజయావకాశాలు మెరుగవుతాయని వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు సూచించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇరువురి మధ్య పొత్తుకు సన్నాహాలు జరుగుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
అయితే, పవన్ కల్యాణ్ తీరు చూస్తుంటే ఆయన తన జనసేన రాజకీయాలను సీరియస్గా నడిపిస్తారా, లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఉద్ధానం కిడ్నీ బాధితుల విషయంపై చర్చించడానికి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు.
చంద్రబాబును కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ మాటల తీరు చూస్తుంటే ఆయన చంద్రబాబుకు దూరం కావాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపించడం లేదు.
చంద్రబాబుకు అనుకూలమేనా....
పవన్ కల్యాణ్ చంద్రబాబుకు అనుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఆయనకు చంద్రబాబు ఇచ్చిన గౌరవమర్యాదలు కూడా ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. చంద్రబాబు వెళ్లే మార్గంలోనే పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోకి అడుగు పెట్టారు. సిఎంవో కార్యాలయం వద్ద ఆయన వాహనం వద్ద బౌన్సర్లు సందడి చేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహిత మిత్రుడైతే తప్ప అవి జరిగే సంఘటనలు కావని అంటున్నారు.
Recommended Video
ముద్రగడపై ఇలా...
కాపు రిజర్వేషన్లపై ముద్రగడ చేపట్టిన ఆందోళనను పరోక్షంగా విమర్శించారు. కాపు రిజర్వేషన్లపై కాంగ్రెసు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఉద్యమాన్ని నడపలేదని అడగకనే అడిగారు. రాజకీయ కారణాలవల్లనే, కావాలని చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఇప్పుడు ముద్రగడ ఆందోళన సాగిస్తున్నారనే విధంగా ఆయన మాట్లాడారు. దీన్నిబట్టి, పవన్ కల్యాణ్ చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది.
పాదయాత్రలు ఒక్కటే మార్గం కాదు...
రాజకీయంగా ఎదిగేందుకు పాదయాత్రలు ఒక్కటే మార్గం కాదని, ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు మనసు ఉంటే చాలునని పవన్ కల్యాణ్ అన్నారు. దీన్నిబట్టి ఆయన జగన్ పాదయాత్రపై పరోక్ష వ్యాఖ్య చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో వైసిపితో కలిస్తే జన సేన గెలుస్తుందంటే తాను నమ్మబోనని, ప్రజల్లోకి వెళ్తే ఎవరి బలం ఏమిటో తెలుస్తుందని ఆయన అన్నారు.
చంద్రబాబు తీరు ఇదీ...
రాష్ట్రంలోని సమస్యలపై జగన్ స్పందించినప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆయనను కౌంటర్ చేసేందుకే ప్రయత్నిస్తోంది. అమరావతికి భూసేకరణ, ప్రత్యేక హోదా, తుందుర్రు మెగా ఫుడ్ పార్కుకు భూసేకరణ వంటి సమస్యలపై జగన్ లేవనెత్తిన ప్రతిసారీ, బాధితుల వద్దకు వెళ్లిన ప్రతిసారీ పవన్ కల్యాణ్ ముందుకు వచ్చి, అవే సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసినట్లుగా మాట్లాడారు. పవన్ కల్యాణ్ రెచ్చిపోయిన వెంటనే చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చినట్లు కనిపిస్తోంది. దీన్నిబట్టి పవన్ కల్యాణ్ జగన్ను కౌంటర్ చేయడానికి చంద్రబాబుకు ఉపయోగపడుతున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.
అనుమానాలు ఇలా....
పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేసి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెబుతున్నారు. ప్రజల్లోకి వెళ్తేగానీ ఎవరి బలం ఏమిటో తెలియదని అంటున్నారు. రాగానే పొడిచేస్తానని కూడా తాను అనడం లేదని ఆయన అన్నారు. ఇదే మాట గతంలో కూడా ఆయన వేరే రూపంలో అన్నారు. విజయం సాధిస్తామని చెప్పడం లేదని, విజయం ముఖ్యం కాదని ఆయన అన్నారు. పార్టీ అధినేతగా తాము అధికారంలోకి వచ్చి తీరుతామని నమ్మకాన్ని పవన్ కల్యాణ్ నాయకులకు, కార్యకర్తలకు కల్పించాల్సి ఉంటుంది. నమ్మకం కలిగించే విధంగానే మాట్లాడాలి. కానీ ఆయనకే నమ్మకం లేకపోతే పార్టీ ఎలా ముందుకు సాగుతుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
జగన్ పొత్తు పెట్టుకుంటే...
పవన్ కల్యాణ్ రాజకీయ అనుబంధంపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో, చంద్రబాబుతో భుజం భుజం రాసుకుని తీరుగుతున్న స్థితిలో జగన్ జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఏ విధమైన ఫలితం వస్తుందనేది కూడా సందేహమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబుతో కెసిఆర్ పొత్తు పెట్టుకుని కాంగ్రెసు గెలవడానికి ఏ విధంగా ఉపయోగపడ్డారో, జగన్తో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకుంటే వచ్చే ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేని స్థితే. జగన్ పూర్తి స్థాయిలో చిత్తయినా కావచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
జగన్ పదును పెడుతున్న సమయంలో.....
వచ్చే ఎన్నికల కోసం తన రాజకీయాలకు జగన్ పదును పెడుతున్న సమయంలోనే పవన్ కల్యాణ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంం నిపుణులను తీసుకుని వచ్చి, చంద్రబాబుతో భేటీ అయ్యారు. జగన్ రాజకీయాలకు ప్రాధాన్యం తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడే విధంగా ఉందని అంటున్నారు.