IIT సీటుపై గుడ్ న్యూస్ చెప్పిన బోర్డు! మార్కులతో పనిలేదు..
దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటీల్లో (IITs) ఇంజనీరింగ్ చదవాలనుకునే విద్యార్థుల కల సాకారమయ్యే సమయం వచ్చేసింది. జేఈఈ అడ్వాన్స్డ్-2026 (JEE Advanced) ఫలితాలు మే 31 రాత్రి అధికారికంగా విడుదలయ్యాయి. అయితే, ఒకవైపు ఫలితాల సంతోషం ఉన్నా.. మరోవైపు సీబీఎస్ఈ (CBSE) 12వ తరగతి మార్కుల వివాదం విద్యార్థులను, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
సీబీఎస్ఈ ప్రవేశపెట్టిన 'ఆన్ స్క్రీన్ మార్కింగ్' (OSM) విధానంలో తప్పులు దొర్లడంతో చాలా మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆశించిన మార్కులు రాలేదు. దీంతో వారు రీ-వెరిఫికేషన్ (పునర్మూల్యాంకనం) కోసం దరఖాస్తు చేసుకుని ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. 12వ తరగతిలో మార్కులు తక్కువగా రావడం వల్ల ఎక్కడ ఐఐటీ సీటు చేజారిపోతుందోనని అభ్యర్థులు భయపడుతున్నారు.
మార్కులతో సంబంధం లేకుండా కౌన్సిలింగ్: ఐఐటీ రూర్కీ ఊరట

ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో పరీక్షను నిర్వహించిన ఐఐటీ రూర్కీ విద్యార్థులకు ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా పెద్ద ఊరటనిచ్చింది. జేఈఈ అడ్వాన్స్డ్లో అర్హత (క్వాలిఫై) సాధించిన అభ్యర్థులందరూ, తమ 12వ తరగతి సీబీఎస్ఈ మార్కులు లేదా శాతంతో (Percentage) సంబంధం లేకుండా వెంటనే 'జోసా' (JoSAA 2026) కౌన్సిలింగ్ ప్రక్రియ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. అయితే, ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. కౌన్సిలింగ్లో సీటు కేటాయించినప్పటికీ.. ఐఐటీ బ్రోచర్లో పేర్కొన్న 12వ తరగతి కనీస మార్కుల అర్హత ప్రమాణాలను అభ్యర్థులు తుది విడత నాటికి ఖచ్చితంగా అందుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సీబీఎస్ఈ రీ-వెరిఫికేషన్ తర్వాత కూడా ఆ మార్కులు రాకపోతే, కౌన్సిలింగ్లో సీటు వచ్చినా అది రద్దవుతుందని ఐఐటీ రూర్కీ స్పష్టం చేసింది.
కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు ఇవే..
ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పాస్ మార్కులను (కటాఫ్) కేటగిరీల వారీగా అధికారికంగా ప్రకటించారు.
- జనరల్ కేటగిరీ: విద్యార్థులకు ప్రతి సబ్జెక్టులో కనీసం 8 మార్కులు రావాలి. మొత్తం (టోటల్) 92 మార్కులు సాధిస్తేనే ర్యాంకు లిస్టులో చోటు దక్కుతుంది.
- OBC-NCL / GEN-EWS: అభ్యర్థులకు ఒక్కో సబ్జెక్టులో కనీసం 7 మార్కులు, మొత్తం 82 మార్కులు అవసరం.
- SC / ST / PwD: విద్యార్థులకు ప్రతి సబ్జెక్టులో 4 మార్కులు, టోటల్ కటాఫ్ 46 మార్కులుగా నిర్ణయించారు.
ప్రిపరేటరీ కోర్సుల జాబితా:
దీని కోసం ఒక్కో సబ్జెక్టులో 2 మార్కులు, మొత్తం 23 మార్కులు వస్తే సరిపోతుంది. ఈ ఏడాది మే 17న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను దేశవ్యాప్తంగా రెండు షిఫ్టుల్లో (పేపర్-1 ఉదయం 9 నుండి 12 వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 వరకు) నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ జోన్ టాప్.. శుభమ్ కుమార్కు ఫస్ట్ ర్యాంక్!
ఈ ఏడాది ఫలితాల్లో 'ఐఐటీ ఢిల్లీ జోన్' అభ్యర్థులు అద్భుత ప్రతిభ కనబరిచి దేశవ్యాప్తంగా ఆధిపత్యం చెలాయించారు. ఆల్ ఇండియా టాప్-3 ర్యాంకులు ఈ జోన్ నుంచే రావడం విశేషం. ఐఐటీ ఢిల్లీ జోన్కు చెందిన శుభమ్ కుమార్ 360 మార్కులకు గానూ ఏకంగా 330 మార్కులు సాధించి దేశవ్యాప్త టాపర్గా నిలిచారు. అలాగే, ఇదే జోన్కు చెందిన అరోహి దేశ్పాండే 360కి 280 మార్కులతో మహిళల విభాగంలో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కామన్ ర్యాంక్ లిస్ట్ (CRL)లో ఆమెకు 77వ ర్యాంక్ లభించింది. ఈసారి ఐఐటీ అర్హత సాధించిన వారిలో మొత్తం 10,107 మంది మహిళా అభ్యర్థులు ఉండటం విశేషం. ఏటా ఐఐటీల్లో అమ్మాయిల ప్రాతినిధ్యం స్థిరంగా పెరుగుతుండటం దేశ విద్యా రంగంలో ఒక మంచి పరిణామంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.














Click it and Unblock the Notifications