కరోనాతో మాజీ ఎమ్మెల్యే చిట్టబ్బాయి కన్నుమూత: సీఎం జగన్, మంత్రుల సంతాపం
తూర్పుగోదావరి: అమలాపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కుడుపూడి చిట్టబ్బాయి(72) కరోనా బారినపడి కన్నుమూశారు. కరోనా సోకడంతో ఆయన కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నాలుగు రోజుల కిందట చేరారు. చికిత్స తీసుకుంటున్న ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.
2004లో కాంగ్రెస్ హవా కొనసాగుతున్న సమయంలో చిట్టబ్బాయికి అధిష్టానం అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అమలాపురం పట్టణంలో కులాలకు అతీతంగా రౌడీషీటర్ల ఆట కట్టించాలని నిర్మోహమాటంగా పోలీసులను ఆదేశించి సఫలీకృతులయ్యారు.
దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి, మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావులకు చిట్టబ్బాయి సన్నిహితులు. ప్రతిపక్ష నాయకుల్లోనూ చిట్టబ్బాయిని అభిమానించేవారుండటం గమనార్హం. కాగా, ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో చివరిసారిగా ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఆస్పత్రిలో ఉన్న చిట్టబ్బాయి పార్థీవదేహానికి వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు కన్నబాబు, వేణు తదితర వైసీపీ నేతలు నివాళులర్పించారు. ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. చిట్టబ్బాయి మరణం పట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Recommended Video
చిట్టబ్బాయి పేరిట అమలాపురంలోని ఈదరపల్లి-నల్లవంతెన బైపాస్ రోడ్డులో ఘాట్ ఏర్పాటుకు 18 సెంట్ల స్థలాన్ని కేటాయించినట్లు మంత్రి విశ్వరూప్ తెలిపారు. శుక్రవారం చిట్టబ్బాయి అంత్యక్రియలు అక్కడే నిర్వహించనున్నారు. కాగా, చిట్టబ్బాయి కుటుంబంలో పలువురికి కరోనా రావడం గమనార్హం. చిట్టబ్బాయి భార్య అరుణ సత్యసుధామణి, కుమారుడు గోపాల్ కరోనా బారినపడ్డారు. కాకినాడ ఆస్పత్రిలో సతీమణి, అమలాపురం ప్రైవేటు ఆస్పత్రిలో కుమారుడు చికిత్స తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications