బీఎస్ఈలో అమరావతి బాండ్లు ప్రారంభం, గంటకొట్టిన బాబు: మళ్లీ తెలంగాణ
Recommended Video
ముంబై: అమరావతి నిర్మాణం కోసం సీఆర్డీఏ జారీ చేసిన అమరావతి బాండ్లను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ)లో సోమవారం నమోదు అయింది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన తర్వాత ఉదయం తొమ్మిదింపావుకు ముఖ్యమంత్రి గంట కొట్టి లాంఛనంగా ప్రారంభించారు.
రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు సీఆర్డీఏ ఇటీవల ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫాంపై బాండ్లను ఇటీవల జారీ చేసింది. గంట వ్యవధిలోనే మదుపర్ల నుంచి రూ.2 వేల కోట్లు సమకూరాయి. అవే బీఎస్ఈలో సోమవారం లిస్టింగ్ అయ్యాయి.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. బీఎస్ఈలో అమరావతి బాండ్లు నమోదు కావడం ఆనందంగా ఉందని తెలిపారు. ఏపీ విభజన తర్వాత ఏపీకి అద్భుతమైన నగరం లేదని, రాజధాని కోసం రైతులను ఒప్పించి 35వేల ఎకరాలను సమీకరించామని చెప్పారు.
‘Amaravati Bond 2018 listed in BSE today #AmaravatiBonds @ashishchauhan @ncbn @AndhraPradeshCM
— BSE India (@BSEIndia) August 27, 2018
Read more at: https://t.co/xgL3JHYULy
సింగపూర్ నుంచి మాస్టర్ ప్లాన్ వచ్చిందని, ప్రపంచంలో అయిదో అత్యుత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలనేది తమ సంకల్పం అన్నరు. 2029 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ సంపద కలిగిన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని చెప్పారు.
బీఎస్ఈ మాదిరిగ ఏపీ కూడా ప్రగతి పథంలో దూసుకుపోతోందన్నారు. ఐటీ రంగంలో ఎక్కువ మంది నిపుణులు భారత్ నుంచి ఉన్నారని, అందులో భారత్ నుంచి ముగ్గురు ఉంటే అందులో ఒకరు ఏపీ నుంచి ఉంటున్నారని చెప్పారు. ఏపీకి సన్ రైజ్ ఏపీగా నామకరణం చేశామన్నారు.
217 చ.కి.మీ. పరిధిలో అమరావతి నిర్మాణం జరుగుతుందని, ప్రపంచంలోనే అతిపెద్ద భూసమీకరణ ప్రక్రియ ఏపీలో జరిగిందన్నారు. వాక్ టు వర్క్ అన్నది అమరావతి నినాదం అన్నారు. నగరాల మధ్య విమాన సర్వీసులు ఎగిరేందుకు అనుమతులు సులభంగా వచ్చేవి కావని, తాను జోక్యం చేసుకోవడంతో కేంద్రం ఓపెన్ స్కై పాలసీ తెచ్చిందన్నారు.
హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయాన్ని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుగా నిర్మించామన్నారు. ఆ ఒక్క విమానాశ్రయం తెలంగాణలో యాభై శాతానికి పైగా స్థూల ఉత్పత్తి సాధిస్తోందన్నారు. ఏ ప్రాజెక్టు అయినా విజయవంతం అయ్యేందుకు లక్ష్యం, విజన్ కావాలన్నారు. అందుకే అమరావతిని గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా నిర్మిస్తున్నామని చెప్పారు. 44 నెలలుగా అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతోందని చెప్పారు.