బయట బాగా లేదు, ప్రపంచంలోని 10 భవనాలకు ధీటుగా: అమరావతి డిజైన్లపై బాబు అసంతృప్తి
రాజధాని అమరావతి ఆకృతులపై నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు.
అమరావతి: రాజధాని అమరావతి ఆకృతులపై నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు.
అద్భుతంగా అసెంబ్లీ, హైకోర్టు: రాజధానికి వన్నె తెచ్చే భవనాలివే(పిక్చర్స్)
రాజధానిలో పరిపాలన నగర నిర్మాణ ప్రణాళిక, ఆకృతుపై చర్చించారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజైన్లపై చంద్రబాబు సూచనలు చేశారు. తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఏపీ రాజధాని: ఆంధ్రుల రాజధాని, బౌద్ద నగరం.. ఇదీ అమరావతి! (పిక్చర్స్)
చంద్రబాబు అసంతృప్తి
పరిపాలనా నగరంలో ముఖ్య భవంతులు, తుది ఆకృతుల పైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు డిజైన్ల పైన కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. నిర్మాణ, ప్రణాళికలకు మరింత సమయం తీసుకోవాలని, మరింత మంచి రూపు తీసుకు రావాలని సూచించారు.
ఆకృతుల్లో కొన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి కానీ
డిజైన్లలో కొన్ని ఎలిమెంట్స్ బాగున్నాయని చంద్రబాబు నార్మన్ పోస్టర్స్కు తెలిపారు. అయితే, బాహ్య రూపం అంత గొప్పగా రాలేదని చంద్రబాబు వారితో అన్నారని సమాచారం.
ప్రజల స్పందనపై చంద్రబాబు
పరిపాలనా భవం ఆకృతులపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వచ్చిందని చంద్రబాబు నాయుడు వారికి తెలిపారు. ప్రపంచంలోని అత్యుత్తమ పది భవంతులకు ధీటుగా ఉండాలని ఆయన వారికి సూచించారు. అకృతులపై పూర్తి స్వేచ్ఛ, సృజనాత్మకత ప్రదర్శించాలని సూచించారు.
డిజైన్లు అందించిన లండన్ సంస్థ
కాగా, అమరావతిలో పరిపాలనా, న్యాయ నగరాల్లో ఐకానిక్ భవనాలుగా నిర్మించనున్న శాసన సభ, హైకోర్టు డిజైన్లను లండన్కు చెందిన నార్మన్ పోస్టర్ అండ్ పార్ట్నర్స్ సంస్థ ప్రభుత్వానికి అందించిన విషయం తెలిసిందే.
రాజీపడేది లేదని
చంద్రబాబు బుధవారమే డిజైన్లపై సూచనలు చేశారు. హైకోర్టు భవనానికి సంబంధించి మరో ఒకటి రెండు డిజైన్లు సిద్ధం చేసుకుని రావాలని సూచించారు. హైకోర్టు బాహ్య ఆకృతి అద్భుతంగా ఉండాలని తెలిపారు. శాసనసభ, హైకోర్టు నిర్మాణాలు ప్రపంచానికే తలమానికంగా ఉండాలని మొదటి నుంచీ చెబుతున్నానని, అందులో రాజీ పడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.
అందరికీ నచ్చేలా
హైకోర్టు భవంతి లోపల ఎలాంటి సౌకర్యాలుండాలో, అంతర్గత నిర్మాణ శైలి ఎలా ఉండాలో హైకోర్టు న్యాయమూర్తులతో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చని చంద్రబాబు తెలిపారు. బాహ్య ఆకృతి మాత్రం తనతోపాటు, రాష్ట్ర ప్రజలందరూ నచ్చి, మెచ్చేలా ఉండాలని అద్భుతంగా రూపొందించి, తీసుకురావాలని చెప్పారు. తాజాగా గురువారం కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు.