అమరావతి రైతులు పండుగ సంబరాల్లో ఉన్నారు .. ఆందోళనల్లో ఉంది రైతులు కాదు : మంత్రి అవంతి
ఏపీలో రాజధాని విషయంలో రగడ కొనసాగుతుంది. జగన్ మూడు రాజధానుల ప్రకటన విషయంలో రాజధాని అమరావతి ప్రాంతంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు భోగి పండుగ సందర్భంగా రాజధాని అమరావతి ప్రాంత రైతులతో కలిసి భోగి మంటలు వేసిన చంద్రబాబు జీఎన్ రావు కమిటీ నివేదికను, బోస్టన్ కమిటీ నివేదికను భోగి మంటల్లో కాల్చేశారు. అంతే కాదు ఈ నివేదికలతో సంబంధం లేదని రాజధాని అమరావతి కోసం ఎంత దాకైనా పోరాటం సాగిస్తామని చెప్పారు. ఇక చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు మంత్రి అవంతి శ్రీనివాస్ .
చంద్రబాబు ఫ్యాబ్రికేట్ ఉద్యమం చేయిస్తున్నాడన్న మంత్రి అవంతి
భోగి సందర్భంగా ఉదయం బెజవాడ బెంచ్ సర్కిల్లో నిరసన వ్యక్తం చేసిన ఆయన.. జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలను భోగి మంటల్లో వేసి తగలబెట్టారు. అయితే, దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అవంతి శ్రీనివాస్ . చంద్రబాబు ముందు నారాయణ కమిటీ నివేదికను తగలబెట్టాలని ఆ తర్వాతే మిగతా వాటి గురించి ఆలోచించాలని సూచించారు. అమరావతిలో ఆందోళన చేస్తున్నది రైతులు కాదని అన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. అంతేకాదు, టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్యాబ్రికేట్ ఉద్యమం చేయిస్తున్నాడని మండిపడ్డారు.
రైతులు పండుగ సంబరాలు చేసుకుంటున్నారన్న అవంతి శ్రీనివాస్
రాజధాని తరలింపుపై 28 రోజులుగా అమరావతి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . సంక్రాంతి పండుగను కూడా జరుపుకోకుండా నిరసన తెలియజేస్తున్నారు. అయితే మంత్రి అవంతి మాత్రం అసలు రైతులు ఎవరూ ఉద్యమాలు చెయ్యటం లేదని చెప్తున్నారు . అమరావతి రైతులు సంతోషంగా ఉన్నారని, పండుగ సంబరాలు జరుపుకుంటున్నారని చెప్పారు మంత్రి అవంతి. ఇక ఇలా చెప్పటం వైసీపీ నేతలకే చెల్లిందని రాజధాని వాసులు మండిపడుతున్నారు .
మూడు రాజధానుల నిర్ణయం ముందు చూపుకు అద్దం పడుతుందన్న మంత్రి
విశాఖ మురళినగర్లో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రి అవంతి రాజధానిలో కొనసాగుతున్న నిరసనల పట్ల తన అభిప్రాయం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల ప్రకటన ముందుచూపుకు అద్దం పడుతోందన్నారు.అమరావతి రైతులకు అండగా అని చెప్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తుంది దొంగ ఉద్యమం అన్నారు. రాష్ట్రంలో ప్రజలు, రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఇక, తెలుగు దేశం పార్టీకి, చంద్రబాబుకు భవిష్యత్ లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు మంత్రి అవంతి శ్రీనివాస్.