33వేల ఎకరాలు ఏం చేస్తామో చూడండి... బోత్స సత్యనారాయణ
అమరావతిలో 50 శాతం పూర్తయిన భవనాలు పూర్తి చేస్తామని మంత్రి బోత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం జరగనున్న క్యాబినెట్ సమావేశంలో క్యాబినెట్ సమావేశంలో అమరావతి అభివృద్దిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే అమరావతి రైతుల అందోళనలు, వారి లేవనెత్తిన సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. దీంతో రైతులు ఎలాంటీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన 33 వేల ఎకరాలు ఏం చేస్తామో శుక్రవారం తేలుస్తామని అన్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయన చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు. ఆయన ఐదు సంవత్సరాలు సీఎం గా ఉండి అమరావతిలో కనీసం ఇళ్లు కూడ కట్టుకోలేదని విమర్శించారు. దీంతో రాష్ట్ర రాజధాని అభివృద్దిపై ఆయనకు ఎలాంటీ చిత్తశుద్ది ఉందో అర్థమవుతుందని అన్నారు. ఇక చంద్రబాబు అమరావతిలో రియల్ ఎస్టెట్ వ్యాపారం చేయాలనే ఆలోచన వైసీపీకి లేదని అన్నారు. రాజధాని నిర్మాణంలో బాధ్యతగా వ్వవహరిస్తున్నామని అన్నారు.
కాగా అమరావతిలో రైతులను మోసం చేయమని ఆయన స్పష్టం చేశారు. మొత్తం 29 గ్రామాల్లో అభివృద్ది చేయాలని జీఎన్ రావు కమిటీ సిఫారసు చేసిందని దీంతో ఆ ప్రాంత అభివృద్దిపై రేపటి క్యాబినెట్లో చర్చిస్తామని చెప్పారు. కాగా రాష్ట్ర ఆదాయం మేరకే రాజధాని నిర్మాణాలపై నిర్ణయం తీసుకున్నామని , రాష్ట్ర బడ్జెట్ను రాజధాని నిర్మాణానికే ఖర్చు పెడితే... సంక్షేమ కార్యక్రమాలతో పాటు విద్యా, వైద్యం మరియు ప్రాజెక్టులకు నిధులు ఎక్కడి నుండి తెస్తామని ఆయన ప్రశ్నించారు. కాగా కేంద్రం కూడ రాజధానిని పూర్తిగా తమ ఖర్చులతో నిర్మిస్తామని విభజన హామీలో కూడ ఎక్కడా చెప్పలేదని బోత్స వివరించారు.