మూడోరోజు గుంటూరు నగరంలో; అమరావతి రైతుల మహా పాదయాత్ర; సంఘీభావం తెలిపిన టీడీపీ నేతలు !!
న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో రైతులు తుళ్లూరు నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు 17 రోజులపాటు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న మహా పాదయాత్ర మూడవ రోజుకు చేరుకుంది. సోమవారం తొలి రోజు పాదయాత్రలో భాగంగా రాజధాని రైతులు 14.5 కిలోమీటర్ల మేర నడిచి పాదయాత్రను కొనసాగించారు. రెండో రోజు తాడికొండ నుండి గుంటూరు శివారు వరకు 12.6 కిలోమీటర్ల పాదయాత్రను సాగించిన అమరావతి రైతులు ఈ రోజు మూడో రోజు పాదయాత్ర కొనసాగిస్తున్నారు.

ఏపీ ఏకైక రాజధానిగా అమరావతికి కొనసాగించాలని రైతుల ఉద్యమం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, జగన్ ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చెయ్యాలనే నిర్ణయాన్ని విరమించుకోవాలని ప్రధానంగా రాజధాని ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు సాగిస్తున్న మహా పాదయాత్రకు టిడిపి, కాంగ్రెస్, జనసేన, సిపిఎం, సిపిఐ, బిజెపి, దళిత బహుజన ఫ్రంట్ పార్టీలతో పాటు వివిధ ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. కానీ వైసీపీ మాత్రం రాజధాని అమరావతి పోరాటం రాజధాని ప్రాంత రైతులు సాగిస్తున్న పోరాటం కాదని, పెట్టుబడిదారులు సాగిస్తున్న పోరాటం అని చెప్తున్నారు.

మూడవ రోజు కొనసాగుతున్న మహా పాదయాత్ర
తొలి రోజు పాదయాత్రలో భాగంగా తుళ్లూరు లో 9 గంటల 5 నిమిషాలకు మహా పాదయాత్రగా బయలుదేరిన రైతులు పెదపరిమిలో మధ్యాహ్నం భోజన విరామం తీసుకున్నారు. ఆ తర్వాత సాయంత్రం తాడికొండ సాయిబాబా గుడి దగ్గర తొలిరోజు పాదయాత్రకు విరామం ఇచ్చారు. ఇక రెండో రోజు పాదయాత్రలో నిన్న తాడికొండ నుండి గుంటూరు శివారు ఈ ప్రాంతం వరకు 12.6 కిలోమీటర్ల పాదయాత్రను చేశారు. ఇక మూడో రోజు రైతుల మహాపాదయాత్ర బుధవారం నాడు గుంటూరు శివారు అమరావతి రోడ్డు నుండి ప్రారంభమైంది .

మూడో రోజు గుంటూరు నగరంలో యాత్ర .. సంఘీభావం తెలిపిన టీడీపీ నేతలు
బుధవారం 10.8 కిలోమీటర్ల మేర చేసే ఈ పాదయాత్ర గుంటూరు నగరంలో కొనసాగనుంది. 3 రాజధానులను రద్దు చేసి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, సి ఆర్ డి ఏ రద్దుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు గుంటూరు నగరవాసులు సంఘీభావం తెలిపారు. రైతులు సాగిస్తున్న మహా పాదయాత్ర లో ఈరోజు టిడిపి నేత ఆలపాటి రాజా, చలసాని శ్రీనివాస్ తదితరులు రైతులకు మద్దతుగా మహా పాదయాత్రలో పాల్గొన్నారు .ఇక బుధవారం పాదయాత్ర పుల్లడిగుంటలో ముగియనుంది.

నాలుగు జిల్లాలలో 70 ప్రధాన గ్రామాల మీదుగా అమరావతి రైతుల మహా పాదయాత్ర
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిరక్షించడం కోసం, అలాగే అన్ని జిల్లాలకు అమరావతి ఉద్యమాన్ని విస్తరించడం కోసం రైతులు నిర్వహిస్తున్న ఈ మహా పాదయాత్ర గుంటూరు, ప్రకాశం,నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరగనుంది . ఈ మహాపాదయాత్ర డిసెంబర్ 17వ తేదీన తిరుపతిలో ముగియనుంది. జగన్ సర్కార్ ఆధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని చేసిన ప్రకటనతో ప్రారంభమైన అమరావతి రైతుల ఉద్యమం నేటికీ కొనసాగుతుంది. ఇంతకాలంగా అమరావతి ప్రాంత రైతులు ఆందోళన తెలుపుతున్నా, జగన్ సర్కార్ మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎవరు ఎంత ఆందోళన చేసినా మూడు రాజధానులు చేసి తీరుతామని జగన్ సర్కార్ తేల్చి చెప్తుంది. ఇదే సమయంలో అమరావతి ప్రాంత రైతులు జగన్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తేల్చి చెప్తున్నారు.












Click it and Unblock the Notifications