అమరావతి రైతుల హార్డ్ డిస్క్ లు మాయం?
ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత పరిధిలోని 29 గ్రామాల రైతులు చేస్తున్న పాదయాత్ర తాత్కాలికంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ టు అరసవెల్లి పేరుతో సెప్టెంబరు 12వ తేదీన ఈ యాత్ర ప్రారంభమైంది. ఉద్రిక్త పరిస్థితుల నడుమ కోనసీమ జిల్లాలో అక్టోబరు 22వ తేదీన ఆగిపోయింది. యాత్ర కొనసాగింపుపై రైతులు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

భద్రతా సిబ్బందిని చితక్కొట్టిన పోలీసులు
యాత్రకు ముందు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామివారి దివ్య రథం ఉంటుంది. ఈ రథానికి నలువైపులా సీసీ కెమెరాలు అమర్చి ఉంటాయి. తాత్కాలికంగా పాదయాత్ర నిలిచిపోయిన నేపథ్యంలో ఆ రథాన్ని రామచంద్రాపురంలోని ఒక ప్రయివేటు స్థలంలో రైతులు నిలిపేసి కాపలాగా భద్రతా సిబ్బందిని ఉంచారు. యాత్ర ఆగిపోయిన వారం రోజులకు రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భద్రతా సిబ్బందిని చితక్కొట్టి, రథానికి అమర్చిన సీసీ కెమెరాల హార్డ్ డిస్కులను ఎత్తుకెళ్లారు.

డీఎస్పీ బాలచంద్రారెడ్డి వివరణ
కాపలాగా ఉన్న భద్రతా సిబ్బంది వెధవల్లా పోలీసుల మీదకు దూసుకురావడంవల్లే వారిని కొట్టాల్సి వచ్చిందని డీఎస్పీ వివరణ ఇచ్చారు. ఒకవేళ వారు పోలీసులపై దాడిచేశారనుకున్నా హార్డ్ డిస్క్ లను ఎందుకు తీసుకువెళ్లాల్సి వచ్చిందని, ముందే నోటీసులు ఇవ్వాలికదా అని అమరావతి జేఏసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు వాటిని న్యాయస్థానంలో అప్పగించలేదని, వాటిని బాలచంద్రారెడ్డి తన దగ్గరే ఉంచుకున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. రామచంద్రాపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి, అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి వ్యవహరించిన తీరుపై విమర్శలు వచ్చాయి. ఆధారాలు మాయంచేయడానికే హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

ఆధారాలు పాడుచేస్తారు..
రథం దగ్గర భద్రతా సిబ్బంది ముగ్గురు డీఎస్పీపై దురుసుగా ప్రవర్తించారని, ఈ కేసులో భాగంగానే కోర్టుకు సమర్పించడానికి హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసు కున్నామని రామచంద్రాపురం ఎస్.ఐ. డి.సురేష్ బాబు ప్రకటించారు. నోటీసులు లేకుండా వాటిని దౌర్జన్యంగా తీసుకువెళ్లారని, ఇన్నిరోజులైనా కోర్టుకు సమర్పించలేదని, 40రోజుల పాదయాత్ర పుటేజి అందులో ఉందని, ఆధారాలు పాడచేస్తారనే అనుమానం తమకుందని అమరావతి జేఏసీ కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు అన్నారు.












Click it and Unblock the Notifications