'అమరావతి' వేడుక: బెజవాడ హోటళ్లు కిటకిట, బాబు హెలికాప్టర్ నిర్ణయం
గుంటూరు: ఈ నెల 22వ తేదీన అమరావతి శంకుస్థాపన నేపథ్యంలో విజయవాడలో హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. స్టార్ హోటళ్లకు పలువురు తరలి వస్తున్నారు. శంకుస్థాపన వేడుకను ప్రభుత్వం వారం రోజుల పాటు నిర్వహించనుంది.
రేపటి నుంచి (మంగళవారం) వారం రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో బెజవాడలో స్టార్ హోటళ్లు ప్రముఖులతో కిటకిటలాడుతున్నాయి. అతిథులకు దేశ, విదేశీ రుచులను అందించేందుకు హోటల్స్ సిద్ధమయ్యాయి.

యుద్ధ ప్రాతిపదికన శంకుస్థాపన పనులు
శంకుస్థాపన పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీలోగా సభా ప్రాంగణాన్ని నిర్మిస్తామని అధికారులు చెప్పారు. 13, 14, 15 తేదీల్లో మన మట్టి - మన నీరు - మన అమరావతి ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని మండలాలు, గ్రామాల నుంచి మట్టిని తీసుకు వస్తారు.
సర్వమత ప్రార్థన చేస్తారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమ ప్రచారం కోసం ఏపీ ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహించనుంది.
కృష్ణా - గుంటూరు జిల్లాల్లో అమరావతి సంకల్ప జ్యోతి ర్యాలీలు నిర్వహిస్తారు. ఈ నెల 18న ప్రతి మునిసిపాలిటీ, ప్రతి మేజర్ పంచాయతీలో 2కే, 5కే రన్ లు నిర్వహిస్తారు. వాటితో పాటు సంఘీభావ ర్యాలీలు కూడా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రతి రాజధాని గ్రామంలో కాగడాల ప్రదర్శన, కొవ్వొత్తులతో ర్యాలీలు, రాష్ట్ర వ్యాప్తంగా 160 ప్రసిద్ధ దేవాలయాలు, 50 చర్చిలు, 50 మసీదుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
చంద్రబాబు కీలక నిర్ణయం
చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి ఇకపై హెలికాప్టర్లోనే వెళ్లాలని నిర్ణయించారు. సాధారణంగా క్యాంప్ ఆఫీస్ నుంచి విమానాశ్రయానికి చంద్రబాబు వెళ్లే సమయంలో విజయవాడ సిటీ, హైవేలో ట్రాఫిక్ను నిలిపివేస్తారు.
దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చారు. మరోవైపు మన మట్టి - మన నీరు కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు రేపు నారావారిపల్లెకు వెళుతున్నారు. మన మట్టి-మన నీరు-మన అమరావతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications