వరం: కేంద్ర బడ్జెట్పై టిడిపి, అమరావతి మెట్రోకు రూ.100 కోట్లు
రాజధాని అమరావతి రైతులకు పన్ను మినహాయింపులు శుభపరిణామం అని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి బుధవారం నాడు అన్నారు.
విజయవాడ: రాజధాని అమరావతి రైతులకు పన్ను మినహాయింపులు శుభపరిణామం అని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి బుధవారం నాడు అన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర పథకాలకు ఊతం ఇచ్చేలా ఉన్నాయని చెప్పారు.
'చంద్రబాబూ! రైతుల చెవుల్లో పూవులు, బడ్జెట్లో 'అమరావతి' సహా ఇవెక్కడ?'
బడ్జెట్ అన్ని వర్గాల వారికి ఊరట కలిగిస్తోందన్నారు. ఉపాధి హామీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. తన పని తీరు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ కామెంట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన పని తీరుకు జగన్ రేటింగ్ అవసరం లేదన్నారు. జగన్ రేటింగ్ జీరో అని, ఆయన ఏపీ ద్రోహి అన్నారు. తన పని తీరు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుసునని పల్లె చెప్పారు.
కేంద్ర బడ్జెట్
కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు చేరువగా, సమపాళ్లలో ఉందని టిడిపి ఏపీ అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. భవిష్యత్ అవసరాలు, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రూపొందించిందన్నారు.
వ్యవసాయ రంగం
వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని, ఉపాధి హామీ పథకానికి గతేడాది కంటే రూ.11వేల కోట్లు అదనంగా కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లో మినహాయింపు ఇవ్వడంహర్షనీయమన్నారు.రాష్ట్రానికి గిరిజన, కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించడంపై సంతోషం వ్యక్తం చేశారు. విశాఖ రైల్వే జోన్ సాకారమయ్యే పరిస్థితి ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అమరావతి మెట్రోకు రూ.వంద కోట్లు
అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్లో రూ.100కోట్లు కేటాయించినట్లు ఆ సంస్థ ఎండీ రామకృష్ణా రెడ్డి తెలిపారు. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు అనుమతి వచ్చిన తర్వాత మరింత నిధులు విడుదలయ్యే అవకాశముందన్నారు. గతేడాది కూడా అమరావతి మెట్రోకు కేంద్ర బడ్జెట్లో రూ.100కోట్లు, రాష్ట్ర బడ్జెట్లో రూ.300కోట్లు కేటాయించారన్నారు.
టెండర్లు పిలిచి..
ఫిబ్రవరి నెలలో మెట్రో ప్రాజెక్టుకు టెండర్లు పిలుస్తామని, టెండరు దక్కించుకున్న కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని ఏప్రిల్ నెలలో పనులు ప్రారంభించాలని చూస్తున్నట్లు తెలిపారు. పనుల ప్రారంభమయ్యే నాటికి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.