అమరావతిపై జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్.. అంగుళం కూడా కదల్చలేవ్
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి తిరుగులేదని, దానికి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించే ప్రక్రియ మొదలైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరిగిన 'ప్రజావేదిక' సభలో ఆయన ప్రసంగిస్తూ.. గత ప్రభుత్వ 'మూడు ముక్కలాట'పై నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందం పొందిన వారికి కాలం చెల్లిందని, అమరావతిని ఇక ఎవరూ అంగుళం కూడా కదల్చలేరని జగన్ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
గత ఐదేళ్లలో అరాచక, విధ్వంస పాలన కొనసాగిందని, అలాంటి వ్యక్తిని (జగన్ను ఉద్దేశించి) తన జీవితంలోనే చూడలేదని చంద్రబాబు మండిపడ్డారు. "రాజధానికి చట్టబద్ధత కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే, కనీసం సభకు కూడా హాజరుకాని పక్షం అది. ఇవాళ పార్లమెంటులో బిల్లు పెట్టి చర్చిస్తున్నారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతే. దీన్ని మేం చేతల్లో చూపిస్తున్నాం" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కోరుకున్న మార్పే నేడు రాష్ట్రంలో సుపరిపాలనకు నాంది పలికిందని పేర్కొన్నారు.

జల భద్రతకే మా ప్రాధాన్యం
ఉదయగిరి ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన వింజమూరు పాతచెరువు పునరుద్ధరణపై సీఎం కీలక ప్రకటన చేశారు. రూ.70 లక్షల వ్యయంతో ప్రజలే స్వచ్ఛందంగా చెరువును బాగు చేసుకునేందుకు ముందుకు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. "ప్రజలు ఒక అడుగు ముందుకు వేస్తే, ప్రభుత్వంగా నేను వంద అడుగులు ముందుకు వేస్తాను. రూ.34 కోట్లతో సోమశిల కాలువ నీటిని ఈ చెరువుకు తరలించేలా వెంటనే ఆదేశాలిస్తున్నాను. అక్టోబర్ నాటికి పనులన్నీ పూర్తి చేసి చెరువును నీటితో నింపుతాం" అని హామీ ఇచ్చారు.
వేసవిలోనూ నిండుకుండల్లా రిజర్వాయర్లు
నీటి పొదుపు, జల భద్రత అంశాలపై తనకున్న నిబద్ధతను చంద్రబాబు వివరించారు. ఎండలు ముదురుతున్నా సోమశిల, కందలేరు రిజర్వాయర్లలో 60 శాతం నీటిని నిల్వ ఉంచగలిగామని తెలిపారు. నీటి భద్రతను ప్రాధాన్యతగా తీసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని, ప్రజలు కూడా నీటి పొదుపులో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఒక్కసారి ఈ ప్రాంతానికి నీరు వస్తే ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications