వైసీపీ ఆ ఫేక్ ప్రచారంపై మంత్రి అదిరిపోయే పంచ్ లు!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వరదల తాకిడికి మునిగిపోయిందని గత కొన్ని రోజులుగా వివిధ సామాజిక మాధ్యమాల్లో వైసిపి ప్రచారం చేస్తుందని, ఇది తప్పుడు ప్రచారమని మంత్రి కందుల దుర్గేష్ ఖండించారు. వరదలతో మునిగేది అమరావతి కాదన్నారు.వలసలతో మునిగేది మాత్రం వైసీపీనే అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో, ఇటీవల జరిగిన ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతతో వైసీపీ మునిగిందని మంత్రి దుర్గేష్ ఎద్దేవా చేశారు.
అమరావతి మునిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ: మంత్రి దుర్గేష్ ఫైర్
ఆది నుండి అమరావతి రాజధానిపై అక్కసుతో ఉన్న వైసిపి నేతలు గతేడాది బుడమేరు వరదల ఫోటోలను, వీడియోలను చూపించి అమరావతి మునిగిందని ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతిని నామరూపాలు లేకుండా చేయాలని ప్రయత్నించారని, నిలువున ముంచేందుకు కుట్ర చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతిని స్మశానం తోను, ఎడారి తోనూ పోల్చారు అని గుర్తు చేశారు.

వైసీపీ నేతలకు ఇది ఎంతవరకు సమంజసం
ఇవేవీ వర్కౌట్ కాకపోవడంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో అమరావతి మునిగిపోయిందని సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.ప్రజలను భయభ్రాంతులను చేసేలా కొండవీటి వాగు, ప్రకాశం బ్యారేజీ గేట్లు పనిచేయడం లేదని, పొన్నూరు, విజయవాడ నగరాన్ని వరద నీరు ముంచెత్తనుందని తప్పుడు ప్రచారానికి తెరదీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు ఇది ఎంతవరకు సమంజసం అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.
దమ్ముంటే రాజధానిలో పర్యటించి ఎక్కడ మునిగిందో చూపించాలని సవాల్
అమరావతి రాజధాని పరిధిలోని ప్రజల బాగోగులు వైసీపీకి పట్టవా అంటూ నిలదీశారు. దమ్ముంటే రాజధానిలో స్వయంగా పర్యటించి ఎక్కడ అమరావతి మునిగిపోయిందో చూపించాలని మంత్రి కందుల దుర్గేష్ సవాల్ విసిరారు. భవిష్యత్ లో కూడా వరదలు వస్తే కూడా రాజధాని అమరావతి మునగదు అన్నారు. వరదలతో రాజధాని ప్రాంతంపై ప్రభావం పడకుండా కొండవీడు ఎత్తిపోతల పథకాన్ని సీఎం చంద్రబాబునాయుడు నిర్మించిన విషయం వైసీపీ మరిచిపోయిందా అంటూ ఆయన ప్రశ్నించారు.
రాజధాని మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారా?
రాజకీయ స్వార్థంతో పొలాల్లో ఉన్న వర్షపు నీటిని జూమ్ చేసి రాజధాని మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారా చెప్పాలని ప్రశ్నించారు. నవ్యాంధ్ర రాజధానిని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తే 11కే పరిమితం అయ్యారనే విషయం మర్చిపోయారా అని ఎద్దేవా చేశారు. అమరావతి మునిగిపోయిందన్న మీ కల కల్లలుగానే మిగిలిపోతుందన్నారు. మీరెలాగూ ప్రజల్లోకి రారు, కనీసం మీ నేతలనైనా పంపించి వాస్తవం తెలుసుకోవాలని సూచించారు.
పార్టీ నేతలు పోతుంటే కాపాడుకోలేని వైసీపీ మునిగిపోయే నావ
అమరావతి ప్రతిష్టతో ఆడుకుంటే మీకు భవిష్యత్ లో 11 సీట్లు కూడా రావని హెచ్చరించారు. అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలపై మాట్లాడే ధైర్యం లేని వైసీపీ సామాజిక మాధ్యమాల ద్వారా ఫేక్ ప్రచారం చేస్తుందన్నారు. పార్టీ నేతలు ఒక్కొక్కరు పార్టీని విడిచి వెళ్తుంటే కాపాడుకోలేని వైసీపీ మునిగిపోయే నావ అని మంత్రి దుర్గేష్ ఘాటుగా విమర్శించారు. వరదల విషయంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే లాగా తప్పుడు కథనాలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరికలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications