ప్రజాప్రతినిధుల దయతో ఉద్యోగాల్లోకి రాలేదు: బొప్పరాజు వెంకటేశ్వర్లు
ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సకాలంలో రావడంలేదు అనే విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగస్తులంటే ప్రజల్లో భాగమేనన్నారు. ప్రజాప్రతినిధుల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉద్యోగాలకు రాలేదని, కష్టపడి పరీక్ష రాసి సంపాదించుకున్నామని చెప్పారు. చట్టపరంగా తమకు రావల్సిన జీతభత్యాలు సమయానికి రావడంలేదని, ముఖ్యమంత్రి చెప్పినా ఇవ్వడంలేదని, దీంతో తాము రోడ్డున పడాల్సి వచ్చిందన్నారు. గతంలో ఇలాంటి సందర్భాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదన్నారు.
జీతాల కోసం ఎదురుచూసే దుస్థితికి చేరుకున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ కమిషన్ సమాచారం ఇచ్చినా ఇప్పటికీ డిపార్ట్ మెంట్ లకు పంపించలేదన్నారు. టీఏ, డీఏలనేవి ఎప్పుడో తీసేశారన్నారు. భారతదేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని పెన్షన్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్నారని బొప్పరాజు విమర్శించారు. కొత్తగా ఈ ప్రభుత్వం ఇచ్చేది ఏమీ లేదని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేయలేదని, మూడేళ్లుగా కమిటీలు తప్ప ఫలితం ఉండటంలేదన్నారు. గతంలో ఏదైనా ఇబ్బంది వస్తే నాయకత్వానికి చెప్పి చేసేవారని, పండగలొస్తే రెండుమూడు రోజులు ముందుగానే వేతనాలిచ్చేవారన్నారు. తమకివ్వాల్సిన అలవెన్స్ లు, టీఏ, డీఏలు నాలుగు సంవత్సరాల నుంచి బకాయి పడ్డారన్నారు.
వేతనాలకు సంబంధించి ఉద్యోగ సంఘ నేత సూర్యనారాయణ గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సూర్యనారాయణకు వ్యతిరేకంగా ఏపీఎన్జీవోతో సహా ఇతర ఉద్యోగ సంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వాధికారుల సిఫార్సు మేరకు సూర్యనారాయణపై చర్యకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు కూడా రద్దుచేయవచ్చంటున్నారు. ఉద్యోగ సంఘాల నేతల వ్యవహారశైలి ఏపీలో చర్చనీయాంశంగా మారింది.