అలిపిరి, శ్రీవారి మెట్టు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లల్లో.. !!
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 67,222 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 33,188 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.90 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది.
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు ప్రతిరోజూ వేలాదిమంది భక్తుల ఆరోగ్య భద్రతపై టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. నిమిషాల్లో వైద్యం అందేలా విరివిగా వైద్య కేంద్రాలు ఏర్పాటు చేసింది. తిరుమలలో మొత్తం 16 వైద్య కేంద్రాలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అశ్వనీ ఆసుపత్రి ప్రధాన వైద్యశాల. దీనికి అనుబంధంగా అపోలో హార్ట్ సెంటర్ పనిచేస్తోంది.

వీటితో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్మెంట-6 ఎదురుగా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లోని ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ పక్కన, కల్యాణకట్ట, ఏటీసీ సర్కిల్, పీఏసీ-5, శ్రీవారి ఆలయం, అలిపిరి నడక మార్గంలోని 1500 మెట్టు, గాలి గోపురం, రద్దీ సమయంలో నారాయణగిరి షెడ్ల వద్ద ఉన్న వైద్య కేంద్రాల్లో 24X7 భక్తులకు వైద్య సేవలు అందుబాటులో ఉంటోన్నాయి.
అదేవిధంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం, పీఏసీ-2, అలిపిరి పాదాల మండపం, ఏడో మైలు, భాష్యకార్ల సన్నిధి, రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో శిలాతోరణం, సేవా సదన్ వద్ద వైద్య కేంద్రాల్లో ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు వైద్య సేవలు అందిస్తారు. శ్రీవారి మెట్టులోని 1200 మెట్టు వద్ద తెల్లవారు జామున 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు వైద్య కేంద్రాలు పని చేస్తాయి.
బ్రహ్మోత్సవాల సమయంలో రామ్ భగీచా-1, పాపవినాశనం వద్ద రెండు అదనపు వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతే కాకుండా మొబైల్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల ద్వారా భక్తులకు వైద్య సేవలు అందించడం జరుగుతోంది.
అందుబాటులో 9 అంబులెన్సులు
భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు తిరుమలలో మొత్తం తొమ్మిది అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మూడు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తుండగా, అయిదు 108, ఒకటి అపోలో అంబులెన్స్. ఇందులో అశ్వనీ ఆసుపత్రి వద్ద మూడు నిరంతరం అందుబాటులో ఉంటాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న రామ్ భగీచా విశ్రాంతి గృహం, ఏటీసీ, అలిపిరి తనిఖీ కేంద్రం, రెండో ఘాట్ రోడ్డులోని లింకు రోడ్డు, మొదటి ఘాట్ రోడ్డులోని 35వ మలపు వద్ద ఒక్కో అంబులెన్సు అందుబాటులో ఉన్నాయి.
అత్యవసరమైన వైద్య సహాయం అవసరమైన భక్తులను ముందుగా అశ్వనీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తారు. మెరుగైన వైద్యం అవరమైన వారిని ఉచితంగా తిరుపతిలోని రూయా, బర్డ్, స్విమ్స్, ప్రభుత్వ మెటర్నటీ ఆసుపత్రులకు తరలిస్తాయి. వీటికి అదనంగా బ్రహ్మోత్సవాలు, రథ సప్తమి వేడుకల సమయంలో వాహన సేవల వెనుక ఒక అంబులెన్సు, నారాయణగిరి షెడ్ల వద్ద ఒక అంబులెన్సును అదనంగా ఏర్పాటు చేస్తుంటుంది టీటీడీ.
128 మంది సిబ్బంది..
తిరుమలలో భక్తులకు వైద్య సేవలు అందించేందుకు ఎనిమిది మంది డాక్టర్లు, 120 మంది పారా మెడికల్ సిబ్బంది రౌండ్ ద క్లాక్ అందుబాటులో ఉంటారు. అన్ని వైద్య కేంద్రాల్లో రోజుకు సగటున 2,400 మంది భక్తులు వైద్య సేవలు పొందుతున్నారు. అశ్వనీ ఆసుపత్రిలో ఈసీజీ, ఎక్స్-రే, ల్యాబ్, నెబ్యూలేషన్, ఆక్సీజన్, డ్రెస్సింగ్ వంటి వివిధ వైద్య సదుపాయాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications