రీటైల్ మెడికల్ షాపులకు బిగ్ షాక్.. ఫార్మా రంగంలోకి Dmart.. 20% డిస్కౌంట్!
ప్రముఖ రీటైల్ సంస్థ డీమార్ట్ ఫార్మసీ రంగంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.ఇప్పటికీ నిత్యావసర వస్తువులు, కిరాణా, గృహోపకరణాల విక్రయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన డీమార్ట్ ఇప్పుడు ఔషధాల విక్రయాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వినియోగదారులకు మందులపై దాదాపు 20 శాతం డిస్కౌంట్ అందించే ప్లాన్ ను రూపొందించినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఔషధాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో డిస్కౌంట్ తో కూడిన మందులు సామాన్య ప్రజలకు ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రతి నెలా మందులు వినియోగించే రోగులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పటికే డీమార్ట్ బ్రాండ్ పై ఉన్న నమ్మకం కూడా ఈ కంపెనీకి లాభం చేకూర్చే అవకాశం ఉంది.
అయితే ఫార్మా రంగంలో అనేక ప్రముఖ కంపెనీలు, ఆన్లైన్ ఫార్మసీలు సేవలు అందిస్తున్నాయి.ఈ పోటీ నేపథ్యంలో డీమార్ట్ తక్కువ ధరలు, నాణ్యమైన సేవలు, అన్ని ఔషధాల లభ్యతపై దృష్టి పెడితే వినియోగదారులను మరింత ఆకర్షించే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని ముంబైలో డీమార్ట్ స్టోర్లలో పైలట్ ప్రాజెక్ట్గా ఫార్మసీ కౌంటర్లను ప్రారంభించింది. ఏకంగా 20 శాతం డిస్కౌంట్ ప్రకటించి వినియోగదారులను ఆకర్షిస్తోంది. ముంబైలోని ఈ కౌంటర్లలో లభించే స్పందనను ఆధారంగా చేసుకుని.. త్వరలో అన్ని డీమార్ట్ స్టోర్లలో వీటిని అందుబాటులోకి తేనుంది. దాదాపు రీటైల్ ధరలకే మెడిసిన్స్ విక్రయించే రిటైల్ మెడికల్ షాపులపై ఇవి తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.

ఇప్పుడు స్థానిక మెడికల్ షాపులన్నీ మందులను దాదాపుగా ఎంఆర్పీకే విక్రయిస్తుంటాయి. అయితే డీమార్ట్ 20 శాతం డిస్కౌంట్లతో మందులను అందించడం వల్ల ప్రతి నెలా ఔషధాలు వాడే కుటుంబాలకు డబ్బు ఆదా అవుతుంది. అదేవిధంగా నిత్యావసర సరుకుల కోసం డీమార్ట్ కు వచ్చే కస్టమర్లు ఇకపై మందులను కూడా అక్కడే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో మెడికల్ షాపుల విక్రయాలు తగ్గిపోయే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.












Click it and Unblock the Notifications