అటు అమరావతిలో ఉద్యమ సెగ.. ఇటు ఉప రాష్ట్రపతికి వినతుల వెల్లువ: వెంకయ్యనాయుడితో భేటీ..!
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ.. అమరావతి ప్రాంత రైతులు, పరిరక్షణ కమిటీ ప్రతినిధులు హస్తిన బాట పట్టారు. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలకు నిరసనగా అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పరిరక్షణ కమిటీ ప్రతినిధులు జాతీయ స్థాయిలో ఉద్యమిస్తున్నారు.
ఢిల్లీలో అమరావతి పరిరక్షణ కమిటీ నాయకులు
ఇందులో భాగంగా- రెండు రోజుల కిందటే దేశ రాజధానికి చేరుకున్న అమరావతి పరిరక్షణ కమిటీ ప్రతినిధులు మంగళవారం ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటున్నారని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి అవసరమైన బిల్లును అడ్డుకున్నందున శాసన మండలిని రద్దు చేశారని వివరించారు.
Recommended Video
మండలి రద్దు తీర్మానాన్ని అడ్డుకోండి..
శాసన మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందని, దాన్ని ఆమోదించకుండా ఎన్డీఏ ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని రావాలని కోరారు. విశాఖపట్నంలో పరిపాలనాపరమైన రాజధానిని ఏర్పాటు చేయడం వల్ల అమరావతి ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. 49 రోజులుగా తాము ఉద్యమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ.. జగన్ సర్కార్ ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోందని, మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోందని అన్నారు.
ఆరా తీసిన వెంకయ్య నాయుడు..
బీజేపీ రాష్ట్రశాఖ నాయకత్వం సైతం మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తోందనే విషయాన్ని వెంకయ్య నాయుడికి వివరించారు. దీనిపై వెంకయ్య నాయుడు స్పందించారు. ఈ విషయంపై తాను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నందున.. తన పరిధికి లోబడి, చేయాల్సినదంతా చేస్తానని హామీ ఇచ్చారు. ఏపీ వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించిన తరువాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల గురించి ఆరా తీశారు.
కేంద్రమంత్రితో..
అనంతరం అమరావతి పరిరక్షణ కమిటీ నాయకులు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ను కలిశారు. ఆయనకు వినతపత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత దళితులు, బడుగు, బలహీన వర్గాలపై దాడులు తీవ్రతరం అయ్యాయని చెప్పారు. అమరావతి ప్రాంత రైతుల్లో ఈ వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారని, ఉద్యమానికి దిగిన మహిళలపై జగన్ ప్రభుత్వం.. పోలీసులను ప్రయోగించిందని ఫిర్యాదు చేశారు.